Inter Weightage | హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ) : ఈ ఏడాది ఇంజినీరింగ్, ఫార్మా వంటి కోర్సుల్లో ఇంటర్ వెయిటేజీ లేకుండానే ప్రవేశాలు జరుగనున్నాయి. ఈ వెయిటేజి తొలగింపు విధానంతో విద్యార్థులకు ఒత్తిడి దూరం అవడమేగాక, ఉపశమనం లభిస్తున్నది. ఎంసెట్ ( త్వరలో టీఎస్ ఈఏపీ సెట్గా మారనున్నది)లో ఇదివరకు ఇంటర్ వెయిటేజీ అమలయ్యేది. ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్, మెడికల్, డెంటల్, ఫార్మ్ -డీ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్ వెయిటేజీని 2011 నుంచి అమలుచేస్తున్నారు. అప్పట్లో ప్రభుత్వం జీవో -73 ద్వారా వెయిటేజీని అమలు చేసింది. ఎంసెట్ మార్కులను 75శాతం, ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీని అమలు చేశారు.
ఈ విధానంతో విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగేది. ఎంసెట్, ఇంటర్ పరీక్షలు భిన్నంగా ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులుపడేవారు. ఇంటర్ వార్షిక పరీక్షలను వ్యాసరూపంలో, ఎంసెట్ను ఆబ్జెక్టివ్ విధానంలో రాయాల్సి ఉండటంతో రెండింటికి సన్నద్ధమయ్యేందుకు విద్యార్థులు తిప్పలుపడేవారు. పైగా వెయిటేజీ కారణంగా ప్రధాన ర్యాంకులను కార్పొరేట్ కాలేజీల్లోని విద్యార్థులు ఎగరేసుకుపోతున్నారన్న అపోహలుండేవి. గ్రామీణ విద్యార్థులు తక్కువ మార్కులతో నష్టపోతున్నారన్న భావనలుండేవి. పైగా ఎంసెట్లో మంచి మార్కులొచ్చినా ఇంటర్లో మార్కులు రాకపోతే ఉత్తమ ర్యాంకు కోల్పోవాల్సి వచ్చేది. సీబీఎస్ఈ, స్టేట్బోర్డు, ఐసీఎస్ఈ, ఓపెన్స్కూల్ వంటి వాటిల్లో గ్రేడింగ్ విధానం, మార్కుల విధానం వేరుగా ఉంటుంది. దీంతో ఫలితాలు వెల్లడించడం ఇబ్బందిగా ఉండేది. గ్రేడింగ్లో అధిక మార్కులు రావడం, మార్కుల విధానంతో స్టేట్ బోర్డు విద్యార్థులకు తక్కువ మార్కులు రావడంతో అసమానతలకు దారితీసేది. ఇది తెలంగాణ ఇంటర్ బోర్డు పరీక్షలు రాసిన విద్యార్థులకు నష్టం కలిగించేది. వీటికి ముగింపు పలుకుతూ ఎంసెట్లో ఇంటర్ వెయిటేజీని ప్రభుత్వం 2023లో శాశ్వతంగా రద్దుచేసింది. తాజాగా విడుదలయ్యే 2024 ప్రవేశాలకు కూడా ఇంటర్ వెయిటేజీ లేకుండా అధికారులు నోటిఫికేషన్ను విడుదల చేయనున్నారు.
ఇంటర్ వెయిటేజీ రద్దుతో విద్యార్థులపై ఒత్తిడి తగ్గింది. టెన్షన్ దూరమైంది. సహజంగా డిగ్రీ వైపు వెళ్లే విద్యార్థులు ఇంటర్ మార్కుల కోసం.. ఇంజినీరింగ్ వైపు వెళ్లేవారు ఎంట్రెన్స్తో పాటు ఇంటర్ మార్కులపై దృష్టిపెడతారు. రెండింటిపై దృష్టిపెట్టడం వల్ల ఎక్కడ పొరపాటు జరిగినా ర్యాంకు కోల్పోవాల్సిన పరిస్థితులుండేవి. వెయిటేజీని శాశ్వతంగా ఎత్తివేయడంతో విద్యార్థులకు ఉపశమనం కలుగుతున్నది. ఇప్పుడు ఎంట్రెన్స్ పరీక్షపై దృష్టి పెట్టే సమయం దొరుకుతున్నది. దీంతో విద్యార్థులు మంచి ర్యాంకు సాధించే అవకాశాలు పెరిగాయి.
– ఎం నాగభూషణ్రావు (ఎంఎన్రావు), గణితం సబ్జెక్టు నిపుణుడు