Ugadai Panchangam | ఈ ఏడాది రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా బీఆర్ఎస్దే విజయమని పంచాంగకర్త శ్రీ రాజేశ్వర సిద్ధాంతి తెలిపారు. కేసీఆర్కు ఈ ఏడాది సానుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్ ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా రాజేశ్వర సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేశారు.
‘ కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ ఏడాది రైతులను పట్టించుకునే స్థితి ఉండదు. ప్రభుత్వం ప్రకటించిన పథకాలు నామమాత్రంగానే ముందుకు వెళ్లడానికి అవకాశం ఉంది. కుజుడు వ్యయ స్థానంలో స్తంభింపడి ఉన్నాడో.. కొద్దిరోజుల తర్వాత పోలీసు వ్యవస్థకు అధికారాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరి వరకు కూడా ప్రభుత్వం చెప్పుచేతుల్లోనే అధికార దుర్వినయోగం అవుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జాగ్రత్తగా ఉండాలి.. కొత్త పెట్టుబడులు పెట్టకూడదు. సంవత్సరాంతంలో కొంత మెరుగుపడే అవకాశం ఉంటుంది.’ అని రాజేశ్వర సిద్ధాంతి తెలిపారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ది కర్కాటక రాశి అని రాజేశ్వర సిద్ధాంతి తెలిపారు. ఈ రాశికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3 ఉందన్నారు. ఆశ్లేష నక్షతం, కర్కాటక రాశిలో కేసీఆర్ జన్మించారని.. మేష లగ్నం, బృహస్పతి ద్వితీయ స్థానంలో, శనైశ్చరుడు ఉచ్ఛ స్థానంలో ఉన్నాడని చెప్పారు. బృహస్పతి వ్యయంలో ఉన్నప్పటికీ అష్టమ స్థానంలో ఉన్న శనైశ్చరుడి ఇబ్బంది పోతుందని అన్నారు. ఫలితంగా కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఈ ఏడాది మళ్లీ ముఖ్యమంత్రిగా పట్టం పట్టడానికి అవకాశం ఉందని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీది ధనుస్సు రాశి అని చెప్పారు. ఈ ఏడాది పార్టీపై మీడియా దుష్ప్రచారం చేసే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. బృహస్పతి సప్తమి స్థితిలో ఉన్నాడు కాబట్టి.. వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి వరకు ఏ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీదే విజయమని స్పష్టం చేశారు. కానీ రాజులు ఎన్నికలు పెట్టేందుకు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయన్నారు. వారి రాజ్యాధికారం కాపాడుకునేందుకే తాపత్రయ పడాల్సి వస్తుందన్నారు. కోర్టులు ముందుకొచ్చి మొట్టికాయలు వేస్తేనే ఎన్నికలు పెట్టే పరిస్థితి వస్తుందని చెప్పారు. కాబట్టి ఈ ఏడాదిలో వీలైనంత ఎక్కువగా ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందని తెలిపారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిది కన్యా రాశి అని చెప్పారు. ఈ రాశికి ఆదాయం 14, వ్యయం 2 రాజపూజ్యం 6, అవమానం 6గా ఉంటుందని తెలిపారు. అయితే ఇన్ని రోజులు మంచి స్థితిలో ఉన్న బృహస్పతి మే 14 రోజున స్థాన చలనం చెందుతాడని చెప్పారు. అప్పటి నుంచి పదవీగండాలు ఎక్కువయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.