బంజారాహిల్స్, ఆగస్టు 2: మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిన్నకుమార్తె ఉమామహేశ్వరి డిప్రెషన్ వల్లనే ఆత్మహత్య చేసుకొన్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 9లో నివాసం ఉంటున్న ఉమామహేశ్వరి, సోమవారం మధ్యాహ్నం స్వగృహంలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మృతురాలి కుమార్తె దీక్షిత ఇచ్చిన ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చిన్నకూతురు దీక్షిత పెళ్లి తర్వాత ఉమామహేశ్వరి ఒంటరితనం ఫీలయ్యేవారని, మానసికంగా ఇబ్బందులు ఎదురవుతుండటంతో యాంటి డిప్రెషన్ మందులు కూడా వాడుతున్నారని గుర్తించారు. ఒకటిరెండు సార్లు నిద్రమాత్రలు అధికంగా తీసుకొని ఆత్మహత్యకు కూడా ప్రయత్నించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఉమా మహేశ్వరి కుటుంబాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎంపీ వేణుగోపాలాచారి తదితరులు పరామర్శించారు. ఉమామహేశ్వరి అంత్యక్రియలు బుధవారం జూబ్లీహిల్స్లోని మహా ప్రస్థానంలో నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు.