హైదరాబాద్, ఆగస్టు 4 ( నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని దళిత వాడలు, గిరిజన ఆవాసాల్లో మెరుగైన మౌలికసదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నది. ప్రతి దళితవాడ, గిరిజన తండాల్లో కనీస మౌలిక వసతులు కల్పించడానికి అంచనాలు రూపొందించి వెంటనే పనులను చేపట్టాలని జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులకు బుధవారం ఆదేశాలు జారీచేసింది. 10 రోజుల్లోగా అంచనాలు రూపొందించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. తండాలు పంచాయతీలుగా ఏర్పడినందున తదనుగుణంగా మౌలిక వసతులు కల్పించాలన్నారు. పట్టణాల్లోనూ సర్వే చేసి పనులకు టెండర్లు పిలవాలని సూచించారు.
ఈ పనులకు ఉపాధి హామీ, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి, ఎంపీ లాడ్స్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు, మున్సిపల్, జడ్పీ, ఎంపీపీ, గ్రామ పంచాయతీ, మిషన్ భగీరథ, డిస్కంల నిధులు, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ నిధులను వినియోగించుకోవాలని సూచించారు. గ్రామాల్లో కొత్త వీధి దీపాలు, విద్యుత్తు స్తంభాలు, కొత్త లైన్లు, తుప్పు పట్టిన విద్యుత్ స్తంభాల తొలగింపు తదితర పనులను విద్యుత్తు డిస్కంలు చేపట్టాల్సి ఉంటుంది. అంచనాలు రూపొందించాక నిబంధనలకు అనుగుణంగా వివిధ శాఖల నిధులను వాడుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో హుజురాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని అమలు చేశారని, ఇతర జిల్లాలో ఇదే తరహాలో అమలు చేయాలని సూచించారు.