గీసుగొండ, మార్చి 9: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీళ్లు తక్కువగా ఉన్నాయి.. కెనాల్ ద్వారా సాగు నీళ్లు ఇచ్చే పరిస్థితులు లేవని, రైతులు బోర్లు బావులపైనే ఆధారపడి వ్యవసాయం చేసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం కోనాయిమాకుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును శనివారం ఆయన పరిశీలించారు. రూ.139 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా గీసుగొండ, సంగెం, దుగ్గొండి మండలాల్లో 14వేల ఎకరాలకు సాగునీరు అందుతాయని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టర్తో మాట్లాడి పనులు ప్రారంభించాలని సూచించారు. రైతులు వ్యవసాయ కరెంట్ను పొదుపుగా వాడుకోవాలని సూచించారు. కెనాల్ వెంట ఉన్న మొరాన్ని అక్రమంగా తరలించే వారిపై కేసులు పెట్టాలని అధికారులను ఆదేశించారు.