హైదరాబాద్ : వరంగల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఇవాళ వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లిన సీఎం దవాఖాన నిర్మాణానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి భూమిపూజ చేశారు. వరంగల్ కేంద్ర కారాగారాన్ని అక్కడి నుంచి తొలగించి ఆ స్థలంలో ప్రభుత్వం దవాఖాన నిర్మించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మొత్తం 60 ఎకరాల్లో 24 అంతస్తులతో సకల హాంగులతో ఈ దవాఖానను నిర్మించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. 2 వేల పడకల సామర్థ్యం, 35 సూపర్ స్పెషాలిటీ విభాగాలతో పూర్తి ఆధునిక వసతులతో దవాఖాన నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. 24 అంతస్తుల భవనంపై హెలిప్యాడ్ను సైతం ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు.