సూర్యాపేట: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని ఆపాలంటూ NGT ఇచ్చిన తీర్పుపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. పవర్ ప్లాంట్ను ఆపేందుకు ఏదో కుట్ర జరుగుతున్నదని ఆయన ఆరోపించారు. అన్ని పర్యావరణ అనుమతులు తీసుకున్నాకే తాము పవర్ప్లాంట్ నిర్మాణం మొదలుపెట్టామని చెప్పారు.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఏకపక్షంగా ఉన్నదని, దీనివల్ల యావత్ దేశానికి కూడా నష్టమని మంత్రి చెప్పారు. వేల కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మాణం చేపట్టిన తర్వాత పవర్ప్లాంట్కు వ్యతిరేకంగా
తీర్పు ఇవ్వడం సరికాదన్నారు. పవర్ప్లాంట్ నిర్మాణాన్ని ఆపాలంటూ లేవనెత్తిన అంశాలు కూడా పూర్తి అసంబద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఎక్కడో ఉన్న ముంబై సంస్థకు యాదాద్రి పవర్ ప్లాంట్ కు సంబంధం ఏమిటని మంత్రి జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. దీని వెనుక కచ్చితంగా కుట్ర దాగి ఉందన్నారు. గతంలో ఇదే ముంబై సంస్థ కేసు వేసినప్పుడు NGT కొట్టి వేసిందన్నారు. మళ్లీ కేసు వేసిన ముంబై సంస్థ వెనుక అదృశ్య శక్తులు ఉన్నాయన్నారు.
అన్ని చట్టాలకు లోబడే యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతున్నదన్న మంత్రి.. ఎన్జీటీ తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని చెప్పారు. అనుకున్న సమయానికల్లా పవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు. ఎన్జీటీ తీర్పుపై న్యాయపోరాటం చేస్తామని ఆయన తెలిపారు.