Lab Grown Meat | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 23 (నమస్తే తెలంగాణ): దేశంలో మాంసానికి ప్రత్యామ్నాయంగా ల్యాబ్ గ్రోన్ మీట్(కృత్రిమ మాంసం)కు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ రంగంలో స్టార్టప్లకు మంచి భవిష్యత్తు ఉండనున్నది. దేశవ్యాప్తంగా మాంసం వినియోగం ఏటా 16 శాతం పెరుగుతున్నది. ప్రస్తుతం 80 శాతం మంది మాంసాహారులే ఉన్నారు. అయితే, వినియోగానికి తగ్గట్టు డిమాండ్ను భర్తీ చేయటం సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో కృత్రిమ మాంసానికి ప్రాధాన్యం ఏర్పడింది. జంతు కణాలను ప్రత్యేక పద్ధతిలో సేకరించి, వాటి నుంచి మాంసాన్ని పోలిన పదార్థాన్ని ల్యాబ్లో అభివృద్ధి చేస్తారు. ఇది పర్యావరణ హితం. 2019 నుంచి ప్రముఖ పరిశోధన సంస్థ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) ల్యాబ్ మీట్పై పరిశోధనలు చేస్తున్నది. ఇది 2025 నాటికి అన్ని అనుమతులతో పూర్థి స్థాయిలో అందుబాటులోకి రానున్నదని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఓవైపు దేశవ్యాప్తంగా మాంసానికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలోనూ ఉత్పత్తి, వినియోగం క్రమంగా పెరుగుతున్నది. స్టాటిస్టిక్స్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనంలో 93 శాతం తెలంగాణలో మాంసాహారులే ఉండగా, ఉత్పత్తి కూడా విపరీతంగా పెరిగింది. 2013 నుంచి 2021 నాటికి ఏకంగా 6 లక్షల టన్నుల మాంసం ఉత్పత్తి చేసే స్థాయికి తెలంగాణ ఎదిగింది. ఒకప్పుడు సగటున ఒక వ్యక్తి 12.95 కిలోల మాంసం వినియోగించగా, 2021-22 నాటికి వ్యక్తిగత వినియోగం 22.55 కిలోలకు చేరిందని రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో పాడి, పశు, మత్స్యసంపద అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.