మెదక్ : జిల్లాలోని ప్రముఖ ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలో భారీ చోరీ జరిగింది. ప్రధాన ఆలయం గర్భ గుడిలో ఉండే హుండీని గుర్తు తెలియని దుండగులు పగులగొట్టారు. అందులో ఉన్న కానుకలను దొంగలు అపహరించారు.
ఇవాళ ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న పూజారులు, సిబ్బంది.. హుండీ చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని చూసి షాక్కు గురయ్యారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. ఆలయ ఈవో, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
ప్రతీ సంవత్సరం మహాశివరాత్రి నాడు ఏడుపాయల జాతర జరుగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. మంజీరా నదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మను దర్శించుకుని భక్తిపారవశ్యంలో పరవశిస్తారు. విశాలమైన ఏడుపాయల ప్రాంగణం జాతర జరిగినన్ని రోజులు అశేష జనవాహినితో జనసంద్రంగా దర్శనమిస్తుంది.