రంగారెడ్డి, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ఆర్థికంగా ఎదగాలంటే బాగా చదివి ఉద్యోగాలే చేయాల్సిన అవసరం లేదని కొద్దిగా కష్టపడేతత్వం, మరికొంత పెట్టుబడి ఉంటే సరిపోతుందని నిరూపించారు పిట్టలగూడవాసులు. బెంగళూరు హైవేకు మూడు కిలోమీటర్ల దూరంలోని ఈ గ్రామంలో 60 కుటుంబాలే ఉన్నా ఒక్కో కుటుంబం నెలసరి ఆదాయం అక్షరాల ముప్పై వేల రూపాయలు. ఇందుకువారు ఎంచుకున్న మార్గం పాడిపెంపకం. ఉమ్మడి రంగారెడ్డితోపాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో అత్యధికంగా పాలు ఉత్పత్తిని చేస్తున్న గ్రామం కూడా పిట్టలగూడమే కావడం విశేషం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండలం నందిగామ పంచాయతీ పరిధిలోని పిట్టలగూడలోని ప్రతీ కుటుంబం జీవనాధారం వ్యవసాయం, పాడి పెం పకం. కుటుంబానికి 5 నుంచి 10 ఆవులు ఉన్నాయి. గ్రామంలో ఎక్కడ చూసినా షెడ్లే దర్శనమిస్తాయి. కొందరు ఇంటి పక్కనే ఆవులకు షెడ్లను వేసుకోగా.. మరికొందరు పొలాల వద్ద నిర్మించుకున్నారు. ఇక్కడ రోజుకు మూడువేల లీటర్ల పాలను ఉత్పత్తిచేస్తున్నారు. ఒక్కో కుటుం బం పూటకు 30 లీటర్ల చొప్పున.. రోజుకు 60 లీటర్ల వరకు పాలను కేంద్రానికి పోస్తున్నది.
రోజుకు మూడు గంటలే కేటాయింపు
ఉదయం గంటన్నర, సాయం త్రం గంటన్నరపాటు ఆవులకు దాణా వేయడం, వ్యర్థాలను తొలగించడం, పాలను పితకడం వం టి పనులకు సమయం కేటాయిస్తున్నారు. రోజుకు 3 గంటల స మయాన్ని పాడి పరిశ్రమకు కేటాయిస్తూ నెలకు ఖర్చులుపోను రూ.30 వేల వరకు సంపాదిస్తున్నారు. ఐదు ఆవులు గల కుటుం బం నెలకు రూ.60 వేలు పొందుతుండగా, ఖర్చులకు రూ.30 వేలుపోగా, మరో రూ.30 వేలు లాభం పొందుతున్నది. లీటరుకు రూ.32ల చొప్పున పాడి రైతుల నుంచి విజయ డెయిరీ సంస్థ గ్రామంలోనే పాలను సేకరిస్తున్నది. పాలు తాజాగా ఉండేందుకు గ్రామంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో రెండు బీఎంసీ కేంద్రాలను పెట్టారు. ఇక్కడి వాతావరణానికి అనుకూలంగా ఉండే మహారాష్ట్ర జెర్సీ ఆవులనే ఇక్కడ సాకుతున్నారు. పదేండ్లుగా పాడి పరిశ్రమలో రాణిస్తూ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది. పిట్టలగూడ కాస్త.. పాల పిట్టలగూడగా వాసికెక్కుతున్నది.
పదేండ్లుగా పాల వ్యాపారం
మా వద్ద ఐదు ఆవులున్నాయి. పూటకు 30 లీటర్ల చొప్పున పాలను విక్రయిస్తూ, ఖర్చులు పోను నెలకు రూ.30 వేలు సంపాదిస్తున్నాం. పదేండ్లుగా పాల వ్యాపారం చేస్తున్నాం. ఏ రోజు కూడా నష్టపోలేదు. మా గ్రామస్తులంతా ఆర్థికంగా వృద్ధి చెందడానికి ప్రధాన కారణం పాడి పరిశ్రమే.