నాగర్కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి సమీపంలో మద్యం తరలిస్తున్న వాహనం సోమవారం సాయంత్రం అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బీరు, లిక్కర్ బాటిళ్లు రోడ్డు పాలయ్యాయి. ప్రయాణికులు, వాహనదారులు దొరికినకాడికి మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు.
అచ్చంపేట పట్టణానికి చెందిన సుభాష్ మద్యం దుకాణందారులు బొలేరో వాహనంలో లిక్కర్ కాటన్లను తీసెకెళ్తున్నారు. వాహనంలో 130 కాటన్ల బీర్లు, 40 కాటన్ల లిక్కర్ తిమ్మాజిపేట మద్యం డిపో నుంచి తరలిస్తున్నారు. ఈ క్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి సమీపంలోగల మంతటి చౌరస్తా వద్ద వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో బీరు బాటిల్, లిక్కర్ బాటిళ్లు పగిలి మద్యం రోడ్డు పాలైంది. చాలా వరకు మద్యం బాటిళ్లను వాహనదారులు, ప్రయాణికులు లూటీ చేశారు. దాదాపు రూ. మూడున్నర లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు. సమాచారం తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.