హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఐసెట్ షెడ్యూల్ విడుదలైంది. మార్చి 5న ఐసెట్ నోటిఫికేషన్ విడుదలకానుండగా, మార్చి 7వ తేది నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. శనివారం హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో టీఎస్ ఐసెట్ మొదటి సెట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఖరారు చేసిన ఐసెట్ షెడ్యూల్ను ఉన్నతవిద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి విడుదల చేశారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఎస్కే మహమూద్, ప్రొఫెసర్ వీ వెంకటరమణ, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, కేయూ వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్, కన్వీనర్ ప్రొఫెసర్ ఎస్ నర్సింహాచారి తదితరులు పాల్గొన్నారు.