జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది. కొద్ది రోజుల క్రితం పశువుల మందపై దాడి చేసిన పులి తాజాగా ఓ పెండ్లి బృందం వాహనం వెంటపడటం స్థానికంగా కలకలం రేపింది. సోమవారం జిల్లాలోని అన్నారం-కాళేశ్వరం మార్గ మధ్యలో చంద్రుపల్లి ఏరియా రాంప్ (కెనాల్ )వద్ద పెద్దపులి పలువురిని భయభ్రాంతులకు గురి చేసింది.
మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ పెండ్లి బృందం టాటా ఏస్ వాహనంలో వెళ్తుండగా.. చంద్రుపల్లి సమీపంలో వాహనం వెంటపడి సుమారు కిలోమీటర్ మేర తరిమినట్లు సమాచారం. వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పులి పాదముద్రల ఆనవాళ్లను సేకరించారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.