ఈ నెలలో 40 డిగ్రీల టెంపరేచర్
ఏప్రిల్ నెలాఖరు నుంచి వడగాలులు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా
హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది వేసవిలో ఏప్రిల్ నెలాఖరు నుంచే వడగాలుల తీవ్రత ఉండవొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. ఈ నెలలో పగటి ఉష్ణోగ్రతలు 37 నుంచి 40 సెల్సియస్ డిగ్రీల వరకు నమోదు కావొచ్చని తెలిపింది. ఏప్రిల్లో 40 నుంచి 45 డిగ్రీలు, మే నెల నుంచి జూన్ మొదటి వారం వరకు దాదాపు 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న వివరించారు. ఈ వేసవిలో అక్కడక్కడా అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, గాలిదుమారాలు కూడా రావొచ్చని చెప్పారు.
సత్తుపల్లిలో 38.9 డిగ్రీలు
ఈసారి రాష్ట్రంలో ఫిబ్రవరి నెలాఖరు నుంచే పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గత వారం రోజుల నుంచి అనేక ప్రాంతాల్లో 35 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో 35 డిగ్రీలపైనే పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 38.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు 18 జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి. ఇది సాధారణ స్థాయి కంటే తక్కువ. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం రెడ్డిపల్లిలో అత్యల్పంగా 11.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
వర్ష సూచన
ప్రస్తుతం రాష్ట్రంలోకి దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావం వల్ల శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 48 గంటల్లో ఆకాశం నిర్మలంగా ఉంటుందని, ఉదయం పొగమంచు ఏర్పడవచ్చని పేర్కొన్నది.