హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఈ నెల 11న తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. కోఠి డీఎంఈ భవనంలో ఉన్న కాన్ఫరెన్స్ హాలులో ఉదయం 10:30 గంటల నుంచి లెక్కింపు ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల్లో 96 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
రాష్ట్రంలో 48,405 మంది డాక్టర్లు టీఎస్ఎంసీలో నమోదై ఉన్నారు. వీరిలో 17,009 మంది డాక్టర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెడికల్ కౌన్సిల్లో 25 మంది డాక్టర్లు సభ్యులుగా ఉంటారు. ఇందులో 12 మందిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. మిగతా 13 మందిని సభ్యులు ఎన్నుకుంటారు. వీరు సీక్రెట్ ఓటింగ్ ద్వారా చైర్మన్ను ఎన్నుకుంటారు.