హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లును పార్లమెంట్ ఆమోదిస్తే దేశవ్యాప్తంగా పోరాటాల మంటలు చెలరేగుతాయని, ఆ మంటల్లో మోదీ ప్రభుత్వం కాలిపోక తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు చేపట్టిన రెండురోజుల సమ్మె శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా సైఫాబాద్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంగణంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ నిర్వహించిన భారీ ధర్నాలో చాడ వెంకట్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటీకరణ విధానాలతో మోదీ ప్రభుత్వం దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నదని, ప్రజలను మరింత పేదరికంలోకి నెట్టి, కార్పొరేట్ సంస్థలకు మరిన్ని లాభాలను తెచ్చిపెట్టే ప్రయత్నం జరుగుతున్నదని విమర్శించారు. ‘బీజేపీ కో హటావో- దేశ్ కో బచావో’ నినాదంతో ప్రజలు ముందుకు కదులుతున్నారని చెప్పారు. బీజేపీ ప్ర భుత్వాన్ని గద్దె దించినప్పుడే దేశానికి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. యూఎఫ్బీయూ కన్వీనర్, ఏఐబీఈఏ జాతీయ కార్యదర్శి బీఎస్ రాంబాబు మాట్లాడుతూ జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లును పారమెంట్లో ప్రవేశపెడితే తక్షణమే నిరవధిక సమ్మె చేపడుతామని హెచ్చరించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు మూలమైన ప్రభుత్వరంగ సంస్థలను అదానీ చేతిలో పెట్టడమే దేశభక్తా అని ప్రశ్నించారు. ఈ చర్యలు దేశద్రోహమని, దేశభక్తి కలిగినవారు ప్రభుత్వరంగ సంస్థలను, ఆస్తులను రక్షిస్తారని అన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్, కేంద్ర సమాఖ్య నాయకుడు వీ నాగేశ్వర్రావు, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు జీ రాంబాబుయాదవ్ పాల్గొన్నారు.