హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): పెండింగ్లో ఉన్న ఏఐబీపీ ప్రాజెక్టుల పనులను ప్రాధాన్యమిచ్చి ఈ ఏడాది పూర్తి చేస్తామని కేంద్రానికి రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ అధికారులు వెల్లడించారు. అందుకు మరికొంత గడువు ఇవ్వడంతోపాటు పెండింగ్ నిధులను విడుదల చేయాలని కోరారు. సత్వర సాగునీటి ప్రయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) కింద దేవాదుల, ఇందిరమ్మ వరద కాలువ, రాజీవ్భీమా, ఎస్సారెస్పీ స్టేజ్2, పాలెం, నీల్వాయి తదితర ప్రాజెక్టులు ఉన్న విషయం తెలిసిందే. ఆయా పనుల పురోగతిపై కేంద్ర జలశక్తిశాఖ చైర్మన్ కుశ్వంత్ఓరా నేతృత్వంలో ఢిల్లీలో సోమవారం ప్రత్యేక సమావేశం కొనసాగింది.
ఈ సమావేశానికి చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్ హాజరై ఆయా ప్రాజెక్టుల పురోగతిని వివరించారు. భూసేకరణ వల్లే ఆయా ప్రాజెక్టుల పనుల జాప్యానికి ప్రధాన కారణమని చెప్పారు. ఈ ఏడాది నీల్వాయి, పాలెం ప్రాజెక్టులను పూర్తి చేస్తామని కేంద్రానికి సీఈ వెల్లడించారు. అదేవిధంగా ఏఐబీపీ కింద దేవాదులకు రూ.100 కోట్లు, ఎస్సారెస్పీ స్టేజ్ 2కు రూ.9 కోట్లు, రాజీవ్భీమాకు రూ.30 కోట్లు, జగన్నాథపూర్ రూ.6 కోట్లు రావాల్సి ఉన్నదని, ఆ నిధులను విడుదల చేయాలని కోరారు. ప్రాజెక్టు పనులు పూర్తిచేసేందుకు ప్రణాళికలను సమర్పించాలని సూచించారు. సమావేశంలో కరీంనగర్ సీఈ శంకర్, వనపర్తి సీఈ, సీడబ్ల్యూసీ రీజినల్ డైరెక్టర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.