సూర్యాపేట, జనవరి 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో రెండో అతిపెద్దదైన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని దురాజ్పల్లి (పెద్దగట్టు) లింగమంతులస్వామి జాతర నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం జీవో జారీచేసింది. యాదవుల ఆరాధ్య దైవమైన లింగమంతులస్వామి జాతర ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి ఐదు రోజులపాటు సాగనున్నది. సమ్మక్క, సారలమ్మ జాతర తరువాత ఆ స్థాయిలో భక్తులు వచ్చే రెండో అతిపెద్ద జాతరగా ఇది ఖ్యాతిగాంచింది.
ప్రత్యేక రాష్ట్రంలో సౌకర్యాలు
రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2015 ఫిబ్రవరిలో తొలి జాతరకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించారు. సీఎం స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ నుంచి రూ.2.10 కోట్లు జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి తీసుకొచ్చారు. 2017లో జాతరకు రూ.1.29 కోట్లు, 2019లో రూ.1.75 కోట్లు, 2021లో రూ.2 కోట్లు ఖర్చు చేశారు. వచ్చే నెలలో జాతర నిర్వహణ కు ప్రభుత్వం మరో రూ.5 కోట్లు మంజూరు చేసింది. ఆ నిధులతో ప్రణాళికాబద్ధంగా సకల సౌకర్యాలు కల్పిస్తామని లింగమంతుల స్వామి ఆలయ పాలకవర్గ చైర్మన్ కోడి సైదులుయాదవ్ తెలిపారు. జాతరకు రూ.5 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు, అందుకు కృషిచేసిన మంత్రి జగదీశ్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.