హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): కరోనా రెండో దశలో వేగంగా వ్యాపిస్తున్నదని, పాజిటివ్ వచ్చిన వ్యక్తి కలిసిన పదిమందిలో ఏడుగురికి వైరస్ సోకుతున్నదని ఉస్మానియా దవాఖాన జనరల్ మెడిసిన్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రతిభాలక్ష్మి తెలిపారు. మన వద్ద ఉన్న ఆయుధాలు వ్యాక్సిన్, మాస్కు మాత్రమేనని.. వాటిని జాగ్రత్తగా ఉపయోగించాలని చెప్పారు. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఏవేవో సమస్యలు ఉంటాయని వస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించారు. గతంలో నీరసం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, విరేచనాలు, దగ్గు, జలుబు, జ్వరం ఉండేవని.. ఇప్పుడు ఒక్కరోజులోనే ఆయాసం, గుండెపోటు, రక్తం గడ్డకట్టడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని ఆమె తెలిపారు. వైరస్ సోకినవాళ్లు తీవ్రతను బట్టి చికిత్స తీసుకోవాలని చెప్పారు. భయం వీడి, బాధ్యతను విస్మరించకుండా కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తే ఈ మహమ్మారి నుంచి క్షేమంగా బయటపడతామని డాక్టర్ ప్రతిభాలక్ష్మి పేర్కొన్నారు.