హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : బదిలీల కోసం ఎంతో ఆశగా వేచిచూస్తున్న మాడల్ స్కూల్ టీచర్లకు పాఠశాల విద్యాశాఖ శుభవార్త చెప్పింది. టీచర్ల బదిలీల షెడ్యూల్ను ఖరారు చేసి సోమవారం విడుదల చేసింది. బదిలీల ప్రక్రియ బుధవారం ప్రారంభమై, 29న ముగియనున్నది. పూర్తిగా ఆన్లైన్ వెబ్బేస్డ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపడుతారు. బదిలీల కోసం https:// schooledu. telangana.gov. in వెబ్సైట్ను సంప్రదించాలని టీచర్లకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన సూచించారు. రాష్ట్రంలోని 194 మాడల్ స్కూళ్లల్లో 3 వేల మంది టీచర్లు, 90 మంది ప్రిన్సిపాళ్లు విధులు నిర్వర్తిస్తున్నారు. పదేండ్లుగా వీరు నియామకమైన చోటే కొనసాగుతున్నారు. తాజా బదిలీల్లో వీరంతా స్థానచలనం పొందుతారు. అయితే బదిలీలకు రెండేండ్ల కనీస సర్వీసు నిబంధనను అమలు చేయనున్నారు. గరిష్ఠంగా ఎనిమిదేండ్ల సర్వీసు పూర్తి చేసిన టీచర్లను తప్పనిసరిగా బదిలీ చేస్తారు. ఇక జీవో -5 ప్రకారం బదిలీలు చేపట్టే అవకాశాలున్నాయి. జీవో -317 ప్రకారం మాడల్ స్కూల్ టీచర్లను కొత్త జిల్లాలకు కేటాయించలేదు. వీరి క్యాడర్ విభజన కేసు కోర్టులో పెండింగ్లో ఉన్నందున ప్రస్తుతానికి పాత జోన్ల ప్రకారమే బదిలీలు చేపడుతారు.
చెట్టుకొకరు పుట్టకొకరుగా
మాడల్ స్కూళ్ల టీచర్ల రిక్రూట్మెంట్లో అప్పటి ఉమ్మడి ప్రభుత్వం, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. దీంతో నియమితులైన టీచర్లంతా చెట్టుకొకరు.. పుట్టకొకరు అన్నట్టుగా తలోచోట చేరారు. 2011లో నోటిఫికేషన్ ఇచ్చినా 2013- 14 వరకు దశల వారీగా టీచర్లను రిక్రూట్చేశారు. దీంతో రోస్టర్ కమ్ మెరిట్ను పాటించలేదు. టీచర్లను కూడా అస్తవ్యస్తంగా కేటాయించారు. తెలుగు, ఇంగ్లిష్, గణితం సబ్జెక్టులకు ఒక్కో స్కూల్లో ఇద్దరు టీచర్లను రిక్రూట్చేసినా.. పోస్టింగ్స్ సమయంలో ఒక పోస్టునే నింపారు.
ఒక్కో స్కూల్లో ఒకే సబ్జెక్టుకు రెండు పోస్టులకు ఎంపికైనా, అవి భర్తీ చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది టీచర్లు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇలా జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఓ టీచర్ ప్రస్తుత సూర్యాపేట జిల్లాలో పనిచేస్తుండగా.. సూర్యాపేటకు చెందిన మరో టీచర్ సిద్దిపేట జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలా పలువురు టీచర్లు తమ స్వస్థలం నుంచి 150 నుంచి 200 కిలోమీటర్ల దూరంలో పనిచేస్తున్నారు. ఉమ్మడి ప్రభుత్వం చేసిన నిర్వాకంతో టీచర్లంతా ఇబ్బందులు పడుతున్నారు. తాజా బదిలీలతో మాడల్ స్కూల్ టీచర్లంతా తమకు సమీపంలోని ప్రాంతాలకు వెళ్లే అవకాశం లభించనున్నది.
ఉపాధ్యాయ సంఘాల హర్షం
మాడల్ స్కూల్ టీచర్ల బదిలీల షెడ్యూల్ను విడుదల చేయడం పట్ల పలు ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. తమ పదేండ్ల కల నెరవేరనున్నదని వెల్లడించాయి. ఇందుకు సహకరించిన మంత్రులకు, ప్రభుత్వానికి తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు, పీఎంటీఏ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.