జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో గండ్ర మోహన్రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సంక్రాంతి మెగా ముత్యాల ముగ్గుల పోటీలకు అపూర్వ స్పందన లభించింది. చుక్కలు, డిజైన్, సందేశాత్మకం, కారుగుర్తు, సంక్షేమ పథకాల వంటి ఐదు విభాగాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించగా 800 మంది మహిళలు, యువతులు పాల్గొన్నారు. ప్రతి విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన 15 మంది విజేతలకు నగదు బహుమతులు ప్రదానం చేశారు. పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ చీరెలను పంపిణీ చేశారు. జీఎంఆర్ఎం ట్రస్ట్ అధ్యక్షుడు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి పాల్గొన్నారు. – జయశంకర్ భూపాలపల్లి, నమస్తే తెలంగాణ