హైదరాబాద్, మే 2(నమస్తే తెలంగాణ): ఎన్నికల విధుల నిర్వహణ సందర్భంగా ఆయా రాజకీయ పార్టీలు, అభ్యర్థులను సమదృష్టితో చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ వ్యాస్ రాష్ట్ర ఎన్నికల అధికారులను ఆదేశించారు. వారు ఇచ్చే ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను వ్యాస్ గురువారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
కలెక్టర్లు, పోలీస్ సూపరింటెండెంట్లు, రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల పరిశీలకులతోపాటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్, వ్యయ నోడల్ అధికారి మహేశ్ భగవత్, అదనపు డీజీ సంజయ్ జైన్, అదనపు సీఈవో లోకేశ్ కుమార్, సంయుక్త సీఈవో సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ, ఈవీఎంలు, పోలింగ్ కేంద్రాలు, ఓటర్లకు కల్పిస్తున్న సౌకర్యాలు, వైద్య బృందాలు, స్ట్రాంగ్ రూమ్లకు అందించాల్సిన భద్రత తదితర అంశాలపై వ్యాస్ ఆదేశాలు జారీచేశారు. ముఖ్యంగా పోలింగ్కు ముందు 72గంటలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి పొరపాటు జరిగినా క్షమించే ప్రసక్తే ఉండదని వ్యాస్ స్పష్టంచేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్లలోని పలు ప్రాంతాల్లో అదనపు భద్రతా బలగాలను మోహరించాలని ఈ సందర్భంగా రాష్ట్ర అధికారులు కోరారు.