హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ పార్టీ 14 ఏండ్ల ఉద్యమ ప్రస్థానం, దాదాపు ఏడేండ్ల ప్రభుత్వ ప్రస్థానం తలచుకుంటే అద్భుతం, అనిర్వచనీయమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. అదే సమయంలో ఆవేదన, సంతోషం కూడా కలుగుతాయని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ 21వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో పార్టీ శ్రేణులకు, ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. నాడు తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసినా.. ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలతో ఉద్యమాన్ని నడిపించి, పార్లమెంటును ఒప్పించి సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని తెలిపారు. రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తూ విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చాక దేశంలో అనేక రాష్ర్టాలు ఏర్పడ్డాయని, కానీ ఏడేండ్ల కిందట ఏర్పడిన తెలంగాణ.. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో లేనివిధంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలతో దూసుకుపోతున్నదని నిరంజన్రెడ్డి పేర్కొన్నారు.