యాదాద్రి, డిసెంబర్ 5 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారు తనకు పునర్జన్మనిచ్చారని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. సోమవారం ఆయన సతీసమేతంగా యాదగిరిగుట్టకు వచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు స్వామివారిని దర్శించుకొని ముంబై వెళ్లి గుండె ఆపరేషన్ చేయించుకున్నానని తెలిపారు. స్వామివారి దయతో పూర్తి ఆరోగ్యవంతుడిగా వచ్చి నారసింహుడిని దర్శించుకొని మొక్కు చెల్లించుకున్నట్టు చెప్పారు. స్వామివారు తనకు పునర్జన్మనిచ్చారన్నారు. యాదగిరిగుట్ట ఆలయాన్ని పునర్నిర్మించేందుకే సీఎం కేసీఆర్ జన్మించి ఉంటారని అన్నారు. యాదగిరిగుట్ట క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన కేసీఆర్ ఆలయ చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు.