హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తయింది. ఫలితంగా నూతన జవసత్వాలు సంతరించుకున్నది. ఇక నుంచి నూతన కార్యాలయాల ద్వారా కార్యకలాపాలు మొదలుకానున్నాయి. పెరిగిన సర్కిల్, డివిజన్, సబ్ డివిజన్ కార్యాలయాల్లో 376 మంది మినిస్టీరియల్ స్టాఫ్ను నియమించారు. టెక్నికల్ పోస్టులైన ఇంజినీర్ పోస్టులను ఇదివరకే ప్రస్తుత అధికారులకు అదనపు బాధ్యతలు కల్పించడం ద్వారా సర్దుబాటు చేశారు. కొత్త కార్యాలయాల్లో నాన్ టెక్నికల్, మినిస్టీరియల్ స్టాఫ్ నియామకాన్ని పూర్తిచేశారు.
శాఖ పునర్వ్యవస్థీకరణలో మొత్తం 3,371 పోస్టులను నిర్ధారించగా, ప్రస్తుతం ఉన్న పోస్టులు 2,961 పోగా, కొత్తగా 472 పోస్టులను మంజూరుచేశారు. ప్రస్తుతమున్న పోస్టుల్లో 392 హెచ్వోడీ పోస్టులు కాగా, 2,569 ఫీల్డ్స్టాఫ్ పోస్టులున్నాయి. కొత్తగా ఏర్పడ్డ 472 పోస్టులను ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసి భర్తీ చేసేవరకు ప్రస్తుతమున్న అధికారులతో సర్దుబాటుచేశారు. కొత్తగా ఏర్పాటైన మూడు చీఫ్ ఇంజినీర్, పది సూపరింటెండెంట్ ఇంజినీర్, 13 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయాలుసహా మొత్తం 328 ఆఫీసులను జూన్ 2వ తేదీన ప్రారంభించిన విషయం విదితమే. ఇప్పుడు మినిస్టీరియల్ స్టాఫ్ నియామకం పూర్తికావడంతో ఇక నూతన కార్యాలయాల నుంచి కార్యకలాపాలు సాగనున్నాయి. నూతన కార్యాలయాల ఏర్పాటు వల్ల పరిపాలన వికేంద్రీకరణ జరిగి రహదారుల నిర్మాణం, రహదారుల మరమ్మతులు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం, నర్సింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ దవాఖానల నిర్మాణంలో వేగం పుంజుకునే అవకాశం ఉన్నది.