ముంబై, ఫిబ్రవరి 13: కొద్ది వారాలుగా చల్లపడిన ఆహార పదార్థాల ధరలు తిరిగి కొండెక్కుతున్నాయి. ఆహారోత్పత్తుల ధరలు పెరగడంతో జనవరి నెలకుగాను రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్ఠస్థాయి 6.52 శాతానికి చేరింది. తిరిగి రిజర్వ్బ్యాంక్కు కేంద్రం నిర్దేశించిన 6 శాతాన్ని మించడం గమనార్హం. 2022 నవంబర్, డిసెంబర్ నెలల్లో మాత్రమే 6 శాతం దిగువకు తగ్గిన ద్రవ్యోల్బణం 2022 జనవరి నుంచి ఆ స్థాయికి ఎగువనే కొనసాగుతున్నది. అక్టోబర్ నెలలో ఇది 6.77 శాతంగా ఉంది. కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన రిటైల్ ద్రవ్యోల్బణం బాస్కెట్లో అధిక వెయిటేజి కలిగిన ఆహారోత్పత్తుల సూచీ వృద్ధి జనవరి నెలలో 5.94 శాతానికి చేరుకున్నది. అంతక్రితం నెలలో ఇది 4.19 శాతంకాగా, ఏడాది క్రితం 5.43 శాతంగా ఉంది. గత నెలలో ముఖ్యంగా తృణధాన్యాలు, మసాలా దినుసులు, ప్రోటీన్ సంబంధిత ఆహారోత్పత్తుల ధరలు పెరగ్గా, కూరగాయల ధరలు మాత్రం తగ్గాయి. 2022-23 సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం 6.5 శాతం మేర ఉంటుందని, క్యూ4 (జనవరి-మార్చిలో) 5.7 శాతానికి పరిమితమవుతుందని ఆర్బీఐ అంచనా వేసింది.