హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండో వేతన సవరణ విషయమై ఉద్యోగ సంఘాలతో పీఆర్సీ కమిటీ చర్చించనున్నది. బుధవారం నుంచి ఈ నెల 26 వరకు మొత్తం 27 సంఘాలతో పీఆర్సీ కమిటీ సమావేశాలు నిర్వహించనున్నది. హైదరాబాద్ బీఆర్కే భవన్లోని పీఆర్సీ కమిటీ కార్యాలయంలో ఈ భేటీలు జరుగనున్నాయి. ఈ మేరకు ఆయా సంఘాలకు షెడ్యూల్ను పీఆర్సీ కమిటీ అధికారులు సమాచారమిచ్చారు. తొలి దశలో ఆయా ఉద్యోగ సంఘాలతో పీఆర్సీ కమిటీ చైర్మన్ శివశంకర్, సభ్యుడు రామయ్య సమావేశమవుతారు. సంఘాల నేతలు సమర్పించిన ప్రతిపాదనలు, వాటి అమలులో సాధ్యాసాధ్యాలపై కమిటీతో చర్చిస్తారు.
పీఆర్సీ కమిటీ.. ఇటీవలే ఆయా సంఘాల నుంచి లిఖితపూర్వకంగా ప్రతిపాదనలను స్వీకరించింది.కనీస వేతనం రూ. 35 వేలు, గరిష్ఠంగా రూ. 2,99,100కు పెంచడంపై ప్రతిపాదనలు అందాయి. సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ పద్ధతిని కొనసాగించాలని, ఆటోమెటిక్ అడ్వాన్స్మెంట్ స్కీంను సవరించాలని,హెచ్ఆర్ఏను పెంచాలని సంఘాలు కోరాయి. ఇదే సమయంలో కనీస పెన్షన్ మొత్తాన్ని రూ.9,500 నుంచి రూ.17,500కు, రిటైర్మెంట్ గ్రాట్యూటీ రూ.16 లక్షల నుంచి రూ. 24 లక్షలకు పెంపు, 15 ఏండ్ల సర్వీసు నిండిన వారికి మొత్తం పెన్షన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరాయి.
అలాగే ఉద్యోగులు, పెన్షనర్లు చనిపోతే ఇప్పుడిస్తున్న రూ.30 వేల దహన ఖర్చులను రూ.75 వేలకు పెంపు, హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్లను ఇప్పుడున్న స్థానాన్ని పెంచి రూ.30 నుంచి రూ.50 లక్షలకు పెంచడం, కామన్ క్యాటగిరీ ఉద్యోగుల వేతనానికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరిండెంటెండెంట్ సేళ్లను ధరల ఆధారంగా పెంచి ఇవ్వడం తదితర అంశాలపై ఉద్యోగ సంఘాలు ప్రతిపాదనలు సమర్పించాయి.