నిజామాబాద్/నారాయణఖేడ్, అక్టోబర్ 2: రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో విడుదల చేయడంపై గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించి కృతజ్ఞత చాటుకుంటున్నారు. రిజర్వేషన్లు పెంచి తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆదివారం పలు గ్రామా ల్లో కేసీఆర్ చిత్రపటాలకు గిరిజనులు క్షీరాభిషేకం చేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం చల్లగిద్ద తండాకు చెందిన టీఆర్ఎస్ నేత సర్దార్నాయక్ 10 శాతం రిజర్వేషన్ల మొక్కు తీర్చుకున్నారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అమలైతే కుటుంబసమేతంగా మహారాష్ట్రలోని తుల్జాపూర్ భవానీమాతను దర్శించుకుంటానని గతంలో సర్దార్ మొక్కుకోగా ఆ మేరకు మొక్కు తీర్చుకొన్నారు. ఆలయ ఆవరణలోనే సంత్ సేవాలాల్ మహారాజ్, సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేసి, మిఠాయిలు పంచి పెట్టారు.
హనుమకొండ, అక్టోబర్ 2: గిరిజనుల అభివృద్ధిని ఆకాంక్షించే సీఎం కేసీఆర్కు గిరిజన జాతి రుణపడి ఉంటుందని మాజీ ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. ఆదివారం హనుమకొండ జిల్లా కాజీపేటలో మీడియాతో మాట్లాడారు. ఎన్నో ఏండ్ల గిరిజనుల కల నేరవేర్చిన సీఎం కేసీఆర్ వెంటే గిరిజనులంతా ఉంటారని చెప్పారు. బంజారాహిల్స్ చరిత్ర తెలుసుకొని బంజారా భవన్, ఆదివాసీ భవన్ నిర్మించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.