హైదరాబాద్ : రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో హరితహారం కార్యక్రమంలో భాగంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8 కోట్ల 76 లక్షల 30 వేల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించాం. ఇప్పటి వరకు 7 కోట్ల 91 లక్షల 2 వేల మొక్కలను నాటామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మిగతా మొక్కలను నాటే ప్రక్రియ ఆగస్టు నెలాఖరు లోగా పూర్తి చేస్తామని అయన తెలిపారు.
నల్గొండ జిల్లాలోని మునుగోడు గ్రామం వద్ద హైవే రోడ్డు పై మొక్కలు నాటుతున్న ఉపాధి హామీ కూలీలతో మంత్రి ముచ్చటించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..ఈ ఆర్థిక సంవత్సరంలో మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్ కింద రాష్ట్రంలో 6 వేల 437 కి.మీ పొడవైన రోడ్ల కిరువైపున ప్లాంటేషన్ ను చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.
అందులో భాగంగా ఇప్పటి వరకు 3 వేల 208 కి.మీ పొడవైన ప్లాంటేషన్ ను పూర్తి చేశామని, మిగతా 3 వేల 155 కి.మీ పొడవైన అవెన్యూ ప్లాంటేషన్ ను వెంటనే పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.
రోడ్డుకిరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ వెంటనే పూర్తి చేయాలని, నాటిన ప్రతి మొక్క సంరక్షించే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి గ్రామ పంచాయతీ సెక్రటరీని ఆదేశించారు.
నాటిన మొక్కలు వాడిపోకుండా ఎప్పటికప్పుడు వాటరింగ్ చేయాలని సూచించారు. మేకలు, ఇతర జంతువుల నుంచి మొక్కలను రక్షించడానికి మొక్కలు నాటిన వెంటనే ట్రీగార్డులు అమర్చాలని మంత్రి ఆదేశించారు.