AP Telangana | నిజం ఎప్పుడూ నిష్టూరంగానే ఉంటది. ఉన్నమాట అంటే ఉలుకే కనిపిస్తది. ఆంధ్రా రాజకీయ నాయకుల పరిస్థితి ఇప్పుడు అచ్చంగా ఇదే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోతే, తెలంగాణలో చీకట్లు కమ్ముకుంటాయని, పరిశ్రమలు తరలిపోతాయని, వ్యవసాయం దెబ్బతింటుందని, భూముల రేట్లు పడిపోతాయని, శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని, హైదరాబాద్ ప్రాభవం కోల్పోతుందని, మొత్తమ్మీద తెలంగాణ అభివృద్ధే ఆగిపోతుందని భయపెట్టి అప్పుడు రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి ప్రయత్నించారు. తెలంగాణ వాళ్లకు పరిపాలన చేతకాదని కూడా ఆ నాయకులన్నారు. తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెస్ అనే తేడాలు చూపకుండా పార్టీలకు అతీతంగా నేతలు ఏకమై తెలంగాణ రాకుండా ఆపడానికి విఫలయత్నం చేశారు. కానీ దేవుని దయ వల్ల వారి ప్రయత్నాలు ఫలించలేదు. చిత్రం ఏమిటంటే ఆనాడు వారు పెట్టిన శాపనార్థాలు కూడా ఫలించలేదు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికబద్ధ పరిపాలనలో తెలంగాణ 9 ఏండ్లలోనే కనీవినీ ఎరుగని అభివృద్ధి సాధించింది. తరలివస్తున్న వందలాది అంతర్జాతీయ పరిశ్రమలు, పనికోసం వస్తున్న లక్షలాది ఉత్తరాది కార్మికులు, వరిస్తున్న కేంద్ర పురస్కారాలే ఇందుకు సాక్ష్యం. నిత్యం కేసీఆర్ను తిట్టే ఆంధ్రా పత్రిక యజమాని సైతం, తెలంగాణ అభివృద్ధి చెందిందని తన వ్యాసాల్లో అంగీకరించారు. 9 ఏండ్లలో తెలంగాణ ఎంతో ముందుకు వెళ్తే, ఆంధ్రప్రదేశ్ బాగా దెబ్బతిన్నదని తెలంగాణలో నివసిస్తున్న ఆంధ్రా ప్రజలే కాదు; ఆంధ్రాలో ఉంటున్నవాళ్లు కూడా బాధపడుతున్న మాట వాస్తవం. దీన్ని వారేమీ దాచుకోవడం లేదు. గత 15 రోజుల్లో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు ఆంధ్రులు కృష్ణంరాజు (వేండ్ర) ఫోన్ ద్వారా తన అభిప్రాయాన్ని ప్రకటించగా, పూర్ణచందర్ (నిడదవోలు) ఏకంగా నమస్తే తెలంగాణకు లేఖనే రాశారు. తెలంగాణ అభివృద్ధి- ఆంధ్రా వెనుకబాటు గురించి ఆంధ్రా ప్రజలు అనుకుంటున్నదాన్నే మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు. ఆయన ప్రశ్నలకు జవాబు చెప్పలేని ఆంధ్రా నేతలు, హరీశ్పై గీతదాటి అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు. ఇంతదాకా వచ్చాక ముసుగులో గుద్దులాట ఎందుకు? తెలంగాణ అభివృద్ధి చెందలేదా? ఆంధ్రా వెనకబడి పోలేదా? కొని చిత్రాలు చూద్దామా?
ఏపీ సచివాలయం దుస్థితి: 2016లో నూతన సచివాలయం నిర్మాణం కోసం అమరావతిలో నాటి సీఎం చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయగా.. ఇప్పటికీ పిల్లర్ల దశ కూడా దాటని నిర్మాణం
తెలంగాణ సచివాలయం: 2021 జనవరి 4న నిర్మాణ పనులు ప్రారంభమైన తెలంగాణ నూతన సచివాలయ భవనం ఈ నెల 30న ప్రారంభానికి సిద్ధమైంది.
పోలవరం ప్రాజెక్టు: ఏపీలో నత్తనడకన సాగుతున్న పోలవరం ప్రాజెక్టు పనులు. 2004లో పనులు ప్రారంభమైన దీనికి కేంద్రం జాతీయ హోదా కల్పించినప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉన్నది.
కాళేశ్వరం ప్రాజెక్టు: 2016లో నిర్మాణం ప్రారంభమైన కాళేశ్వరం ప్రాజెక్టు మెరుపు వేగంతో 2019 నాటికే పనులు పూర్తి చేసుకొని నేడు వేల ఎకరాల భూములకు సాగు నీరందిస్తున్నది.
ఏపీ జిల్లా కలెక్టరేట్: పురాతన భవనాల్లో ఏపీ జిల్లా కలెక్టరేట్లు
సర్వహంగులతో: తెలంగాణలో సకల సదుపాయాలతో నిర్మాణమైన సమీకృత కలెక్టరేట్ భవనాలు
నీటికి కటకట: ఏపీలోని పలు గ్రామాల్లో తాగునీటి కోసం పడిగాపులు పడుతున్న మహిళలు
మిషన్ భగీరథ: తెలంగాణలోని ప్రతి ఇంటికీ చేరుతున్న మిషన్ భగీరథ తాగునీరు. ఎక్కడా లేని విధంగా ప్రతి ఇంటికీ తాగునీటి చేరుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
ఇరుకు ఇరుకుగా: ఏపీలో ప్రభుత్వ దవాఖాన దుస్థితి
విశాలంగా: తెలంగాణలోని ప్రతి జిల్లాలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ దవాఖానలు
అడుగడుగునా గుంతలే: తారు, దాని కింది కంకర కూడా కొట్టుకుపోగా మట్టి తేలిన రాష్ట్ర రహదారులు
సాఫీగా ప్రయాణం: ప్రతి పల్లెకు ఇరువైపులా పచ్చదనంతో కళకళలాడుతున్న రహదారులు