వెంకటాపూర్, సెప్టెంబర్ 9 : ములుగు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతికే తమ ఓటు అని వెంకటాపూర్ మండలంలోని గుర్రంపేట ప్రజలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ గ్రామం నుంచి పూర్తి ఓట్లు బీఆర్ఎస్కే వేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ మేరకు వారు శనివారం గ్రామ పంచాయతీ ఆవరణలో తమ ఓట్లన్నీ నాగజ్యోతికేనని ప్రతిజ్ఞ చేశారు.
వచ్చే ఎన్నికల్లో ఆదివాసీ ముద్దుబిడ్డ నాగజ్యోతి గెలుపు ఖాయమని వారు స్పష్టం చేశారు. కార్యక్రమానికి హాజరైన అభ్యర్థి నాగజ్యోతి మాట్లాడుతూ.. ములుగు నియోజకవర్గానికి ప్రతిపక్ష పార్టీ నుంచి సీతక్క ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ మాత్రం ఈ ప్రాంతం వెనుకబడకుండా రాజీలేకుండా అభివృద్ధిలో అన్ని విధాలుగా ముందుకు నడిపించిన విషయాన్ని గుర్తుచేశారు. తనను గెలిపిస్తే ములుగు నియోజకవర్గాన్ని ప్రజలు ఊహించని రీతిలో అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.