హైదరాబాద్, జూన్14 (నమస్తే తెలంగాణ): గురుకుల విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ బ్లూ క్రిస్టల్’ ప్రాజెక్టు విజయవంతంగా దూసుకుపోతున్నది. అందుకు ఇటీవల విడుదలైన నీట్ ఫలితాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఏకంగా 275 మంది సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులను కైవసం చేసుకున్నారు. అంతేకాకుండా పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ (పీవీటీజీ)కు చెందిన విద్యార్థులు సైతం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నీట్లో తొలిసారి అత్యత్తమ ర్యాంకులను సాధించడం మరో విశేషం. నిరుపేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా నీట్ లాంగ్టర్మ్ కోచింగ్ను అందించి వారు వైద్యవృత్తిలోకి వెళ్లేందుకు అండగా నిలుస్తున్నది.
అందులో భాగంగా ఎస్సీ గురుకులాల్లో ఆపరేషన్ బ్లూ క్రిస్టల్ (ఓపీబీసీ), గిరిజన గురుకులాల్లో ఆపరేషన్ ఎమరాల్డ్ (ఓపీఎం) పేరిట ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నది. ఈ ఏడాది ఓపీబీసీ కింద 223 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వగా.. వారిలో 153 మంది ర్యాంకులు సాధించారు. రెగ్యులర్ గురుకులాలకు చెందిన మరో 50 మంది ర్యాంకులు కైవసం చేసుకోవడంతో ఈసారి సాంఘిక సంక్షేమ గురుకులాల నుంచే 203 మంది ర్యాంకులు సాధించినట్టయింది. ఆపరేషన్ ఎమరాల్డ్ కింద ఈ ఏడాది 93 మంది గిరిజన విద్యార్థులకు నీట్ లాంగ్టర్మ్ కోచింగ్ ఇవ్వగా.. వారిలో 64 మంది ర్యాంకులు సాధించారు. వీరితోపాటు రెగ్యులర్ గురుకులాకు చెందిన మరో 8 మంది ర్యాంకులు పొందడంతో గిరిజన గురుకులాల నుంచి మొత్తం 72 మంది విద్యార్థులు ర్యాంకులు కైవసం చేసుకున్నట్టయింది. దీంతో ఓపీబీసీ, ఓపీఎం కింద శిక్షణ పొందిన వారిలో మొత్తంగా 69 శాతం మంది విద్యార్థులు ర్యాంకులు లభించాయి.
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థిని గుగులోత్ సంధ్య ఆలిండియా స్థాయిలో 90వ ర్యాంకును కైవసం చేసుకున్నది. అదేవిధంగా జయపాల్ రమావత్ 803, ఆర్ భార్గవి 2,032, బుదావత్ నవ్యశ్రీ 3,018, జీ పావని 3,179 ర్యాంకులు సాధించారు. గిరిజన గురుకులాల నుంచి బానోత్ శశికుమార్ 414, ధరావత్ సుమన్ 718, గుగులోత్ లక్ష్మీతేజ 724, చౌహన్ అరుణ్కుమార్ 921, గోదావత్ మునినాయక్ 939 ర్యాంకులను సొంతం చేసుకున్నారు.
సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యార్థులు అత్యధిక ర్యాంకులు సాధించడంపై మంత్రులు సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్ రోస్ హర్షం వ్యక్తం చేశారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను, అందుకు కృషిచేసిన అధ్యాపకులను ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్లో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.