హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): జాతీయ పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ పథకం నుంచి బయటకు వచ్చే స్వేచ్ఛ లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించటాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ప్రపంచ బ్యాంకు షరతులకు లోబడి కార్పొరేట్ శక్తుల షేర్ మారెట్ వ్యాపారంలో ఫైనాన్స్ క్యాపిటల్గా ప్రజాధనాన్ని వినియోగించుకోవటానికే చందాతో కూడిన పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నారని ధ్వజమెత్తింది.
కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలను కాపాడేందుకే నిర్మలా సీతారామన్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఎస్టీఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షుడు, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కే జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి విమర్శించారు. శనివారం టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రజలపై కేంద్ర ఆర్థిక మంత్రికి నిజంగా ప్రేమ ఉంటే పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. జాతీయ పెన్షన్ పథకంతోపాటు జాతీయ విద్యావిధానం రద్దు కోసం దేశవ్యాప్తంగా ఎస్టీఎఫ్ఐ ఆధ్వర్యంలో జరుగుతున్న సంతకాల సేకరణలో తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులంతా పాల్గొనాలని టీఎస్ యూటీఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు.