చింతకాని, ఫిబ్రవరి 4: నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే అధికారులు కనికరం లేకుండా వ్యవహరించారు. రైతుల భూములను అతి తక్కువ పరిహారానికి సేకరించిన అధికారులు.. సదరు భూముల్లోని పంటను నిర్దాక్షిణ్యంగా నాశనం చేశారు. పక్షం రోజులు గడువు ఇవ్వాలని వే డుకున్నా వారి గోడుపట్టించుకోలేదు. సూర్యాపేట – దేవరపల్లి నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు శనివారం ఖమ్మం జిల్లా చిం తకాని మండలంలోని కొదుమూరు నుంచి నేషనల్ హైవే అధికారులు ప్రారంభించారు. రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా కొదుమూరులో పలువురు రైతులకు చెందిన మక్కజొన్న పంటను అధికారులు భారీ యంత్రాల సహాయంతో నేలమట్టం చేయించారు.
చేతికొచ్చిన పంటను నేలమట్టం చేయించడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. పంట పీచు దశలో ఉండి కంకులు పాకానికి వచ్చాయని మరో 15 రోజులు సమయమిస్తే పంట చేతికొచ్చేదని రైతులు జాతీయ రహదారి అధికారులను వేడుకున్నా పట్టించుకోలేదు. తాసిల్దార్ మాలోత్ మంగీలాల్ నేషనల్ గ్రీన్ఫీల్డ్ అధికారులతో కలిసి ఘటనా స్థలానికి వచ్చి రైతులతో మాట్లాడారు. విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తాసిల్దార్ రైతులకు హామీ ఇచ్చారు. ఎకరం పొలం విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని, కానీ నేషనల్ గ్రీన్ఫీల్డ్ అధికారులు రూ.26 లక్షల చొప్పున పరిహారం ఖాతాల్లో జమచేశారని రైతులు పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు సహకరించి భూములిచ్చామని, పక్షం రోజులు ఆగితే పంట చేతి కొస్తుందని రైతులు చెప్తున్నారు.