నాదర్గుల్ భూములపై మళ్లీ కలకలం రేగుతున్నది. ఒకే సర్వేనంబర్ భూములకు చెల్లించిన నగదులో వ్యత్యాసంపై అన్నదాతలు రగులుతున్నారు. గతంలో ఎకరాకు ఐదారు లక్షలతోనే సరిపెట్టిన కంపెనీలు, ఇటీవల తోటి రైతుల నుంచి రూ.30 లక్షల చొప్పున కొనుగోలు చేయడంపై ఆగ్రహం పెల్లుబుకుతున్నది. ‘నాదర్గుల్ భూములు.. బిగ్ హస్తగతం’ అనే శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో శనివారం ప్రచురితమైన ప్రత్యేక కథనంతో అసలు విషయం బయటపడి కలకలం మొదలైంది.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): నాదర్గుల్ భూముల వ్యవహారంలో తెరవెనుక సర్కార్ పెద్దల అండ, రెవెన్యూ శాఖ ఉద్దేశపూర్వక మౌనముద్ర, ప్రైవేటు భూములు అంటూ హైడ్రా ధ్రువీకరణ.. ఇన్ని అనుకూలతలు ఉన్నా రికార్డుల తారుమారు ఎలా? అనే దానిపై కార్పొరేట్ కంపెనీ మల్లగుల్లాలు పడుతున్నది. మొదట్లో నంబర్-2 మంత్రి కనుసన్నల్లో నడిచిన వ్యవహారం ఇప్పుడు బిగ్బ్రదర్ చేతుల్లోకి పోవడంతో కొన్నిరోజులపాటు దూకుడు ప్రదర్శించింది. ఇందులో భాగంగానే కొందరు రైతులను నయానో భయానో దారిలోకి తెచ్చుకొని ఎకరాకు రూ.30 లక్షలు ముట్టజెప్పిన విషయం తెలిసిందే. గతంలో ఐదారు లక్షలతో సంతృప్తిపడిన రైతులంతా ‘ఒక్కో రైతుకు ఒక్కోరేటు ఇస్తరా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ గ్రామ పరిధిలోని సర్వేనంబరు 613 (పాత 119)లో 373.22 ఎకరాల ప్రభుత్వ భూమి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. ఈ క్షణానికీ రెవెన్యూ రికార్డుల్లో రాష్ట్ర ప్రభుత్వ భూమిగా నమోదై ఉన్నా, క్షేత్రస్థాయిలో మాత్రం ఒక ప్రైవేట్ కంపెనీ చేతిలో బందీకావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. గజం ప్రభుత్వ భూమిని కూడా కబ్జా కానీయబోమంటూ హైడ్రా, ప్రభుత్వ పెద్దలు చేసే ప్రకటనలన్నీ ప్రజలను మభ్యపెట్టేందుకే అనడానికి ఈ భూముల బందీయే ప్రత్యక్ష ఉదాహరణ.
సుప్రీంకోర్టులో ఇవి ప్రభుత్వ భూములేనంటూ న్యాయ పోరాటం చేస్తున్న రెవెన్యూ అధికారులు మాత్రం అవే భూములను తమ ఆధీనంలోకి మాత్రం తీసుకోవడం లేదు. పైగా వాటికి సంబంధించి సీలింగ్ ప్రక్రియ మొదలుపెట్టామంటూ చేసే ప్రకటన మరో విడ్డూరం. ఇలా అనేక చిత్ర విచిత్రాలకు వేదికగా మారిన ఈ భూములు బిగ్బ్రదర్స్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత స్థానికంగా కొంత స్తబ్దత నెలకొన్నది. చాకచక్యంగా రైతుల మధ్య విభేదాలు సృష్టించి.. ఇన్నాళ్లూ డబ్బులు తీసుకోని రైతులను దారిలోకి తెచ్చుకున్నారు.
ఎకరాకు రూ.30 లక్షలు ముట్టుజెప్పారు. ఈ సెటిల్మెంట్ జరిగి చాలా రోజులైనా గ్రామంలో పెద్దగా చర్చ జరుగలేదు. కానీ శనివారం ‘నమస్తే తెలంగాణ’లో కథనం వచ్చిన తర్వాత మళ్లీ కలకలం మొదలైంది. గతంలో రూ.ఐదారు లక్షలతోనే అనధికారిక ఒప్పందాలపై సంతకాలు చేసిన రైతులు ఇప్పుడు భగ్గుమంటున్నారు. ఒకే గ్రామం, ఒకే సర్వేనంబరులోని భూమికి వాళ్లకెలా రూ.30 లక్షలు ఇస్తారు? మాకు ఐదారు లక్షలే ఇస్తారా? అంటూ గుర్రుమంటున్నారు. తమకు కూడా ఎకరాకు అంతే రేటు కట్టించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఒక రైతుకు ఆ సర్వేనంబరులో ఎకరా భూమికి ఏకంగా రూ.కోటి ఇచ్చినట్టు తాజాగా ప్రచారంలోకి వచ్చింది. తక్కువ మొత్తం తీసుకొన్న విషయం తెలిసిన రైతులకు కంటిమీద కునుకేలేకుండా పోయింది. తాము మౌనంగా ఉండటం వల్లే తక్కువ మొత్తంతో సరిపెట్టారని, అందుకే మరోసారి ఆందోళనకు సిద్ధమైతే తప్ప తమకు న్యాయం జరుగదని రైతులు భావిస్తున్నారు. ఈ మేరకు బిగ్బ్రదర్ను కలువాలా? సదరు కార్పొరేట్ కంపెనీ ప్రతినిధులను కలువాలా? అని రైతులు చర్చించుకుంటున్నారు. తమకు కూడా రూ.30 లక్షల చొప్పున చెల్లించకపోతే మరోసారి భూముల్లోకి వెళ్లి నిరసన మొదలుపెట్టాలనే యోచన చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
నాదర్గుల్ భూములపై తెరవెనుక పూర్తిగా బిగ్బ్రదర్ రావడంతో దూకుడు ప్రదర్శించిన కార్పొరేట్ కంపెనీ.. తప్పుడు ప్రచారంతో మరింత పట్టు బిగించేందుకు స్కెచ్ వేసినట్టు తెలుస్తున్నది. నాదర్గుల్ భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించారంటూ ప్రచారం చేయిస్తున్నది. 22ఏలో పలు విభాగాల్లో భూముల వివరాలు నమోదు చేస్తారు. ఇందులో భాగంగా ‘ఏ’ జాబితాలో పూర్తిగా అసైన్డ్ భూముల వివరాలు ఉంటాయి.
‘బీ’ జాబితాలో ప్రభుత్వ భూముల వివరాలు పొందుపరుస్తారు. అయితే కేవలం ‘ఏ’ జాబితాను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ 613 సర్వేనంబరు నిషేధిత జాబితాలో లేకుండా చేశారంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో శనివారం పలువురు గ్రామస్తులు ‘నమస్తే తెలంగాణ’ దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చారు. ఈ మేరకు పరిశీలించి, సదరు సర్వేనంబర్ ఇంకా ‘బీ’ జాబితాలో ఇంకా ప్రభుత్వ భూమిగానే ఉన్నదన్న వాస్తవాన్ని వాళ్ల దృష్టికి తీసుకెళ్లడంతో, ఇదంతా కార్పొరేట్ కంపెనీ ఆడుతున్న డ్రామాగా బట్టబయలైంది.