అమరావతి : నేడు దేశంలో అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లి సీఎస్ఆర్ కల్యాణ మండపంలో సీపీఎం 26వ రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు మహాసభలు జరగనున్నాయి.
మహాసభలకు ఏచూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతోపాటు పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్, బీవీ రాఘవులు ఉన్నారు. సీతారం ఏచూరి పార్టీ పతాకాన్ని ఎగురవేసి మహా సభలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏచూరి మాట్లాడుతూ.. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని, కొవిడ్ తర్వాత సంక్షోభం మరింత ముదిరిందని తెలిపారు. హిందుత్వ ఉన్మాదంతో దేశాన్ని కలుషితం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్రం తెచ్చిన ఉద్దీపన ప్యాకేజీ వల్ల కంపెనీల లాభాలు పెరగడం తప్ప.. సామాన్యులకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. చిలీ, పెరూ వంటి దేశాల్లో కమ్యూనిస్టులు బలపడుతున్నారని సీతారం ఏచూరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా హామీ అటకెక్కింది.
రాష్ట్ర విభజన హామీలు అమలు చేయట్లేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనులు జరగట్లేదు. రాష్ట్రంలోని 3 ప్రాంతీయ పార్టీలు భాజపాకు సహకరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. మూడు రోజుల సమావేశాల్లో చర్చించి రాజకీయ కార్యాచరణ ఖరారు చేస్తామని స్పష్టం చేశారు.