Hyderabad Metro | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరం చుట్టూ మణిహారంలా మారుతుందనుకున్న మెట్రో విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు త్రిశంకుస్వర్గంలో పడింది. కేసీఆర్ ప్రభుత్వం ఆమోదించిన విస్తరణ ప్రాజెక్టు ప్రకారం ముందుకుపోలేక.. కొత్తగా వచ్చిన రేవంత్ సర్కారు నిర్ణయంతో విస్తరణ ప్రాజెక్టుపై ఉన్నపళంగా వెనక్కి తగ్గలేక… కొత్త ప్రతిపాదనపై పరుగులు పెట్టలేక… హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) తర్జనభర్జన పడుతున్నది. ముఖ్యంగా టెండర్ల దశను పూర్తి చేసుకున్న ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టును రేవంత్ ప్రభుత్వం రద్దు చేయడంతో ఆ చిక్కుముళ్లను విప్పుకునేందుకు అధికారులు కిందా మీదా పడుతున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం గతంలో మెట్రో విస్తరణ ప్రాజెక్టును రూపొందించింది. ప్రస్తుతమున్న 69 కిలోమీటర్లుసహా సమారు 415 కిలోమీటర్ల మెట్రో విస్తరణ ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గతంలోనే రూ.6,250 కోట్లతో 31 కిలోమీటర్ల ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేసి, టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టింది. ఎల్అండ్టీ, ఎన్సీసీ రెండు సంస్థలు ముందుకు రాగా.. ఏజెన్సీ ఎంపిక పూర్తి కాలేదు. ఈ క్రమంలో కొత్తగా వచ్చిన రేవంత్ సర్కారు ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టును రద్దు చేసింది. ఆయా ప్రాజెక్టులపై హెచ్ఎంఆర్ఎల్ కొన్ని అడుగులు ముందుకు వేసిన దరిమిలా మళ్లీ వెనక్కి రావాలంటే పాలన, న్యాయపరంగా కొన్ని రకాల చర్యలు తప్పవు.
ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.6,250 కోట్లు కాగా, ఇందులో ప్రాజెక్టు నిర్మాణానికి రూ.5,688 కోట్ల వరకు అవుతున్నందున ఆ మేరకే టెండర్లు పిలిచారు. మిగిలిన మొత్తంలో రూ.100 కోట్ల వరకు థర్డ్పార్టీ పరిశీలనకు కేటాయించారు. ఇందుకోసం సిస్ట్రా కన్సార్టియం ఎంపిక కాగా… ఆ సంస్థ హెచ్ఎంఆర్ఎల్ కార్యాలయ భవనంలో తన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నది. ఇప్పుడు ఆ సంస్థతో ఒప్పందాన్ని తెగతెంపులు చేసుకోవాలంటే ఎలా అనే దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
రేవంత్ ప్రభుత్వం గత ప్రాజెక్టులను కాకుండా పాతబస్తీ నుంచి ఎయిర్పోర్టు వరకు మెట్రో ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. ఇందుకోసం సర్వే చేయాల్సిందిగా హెచ్ఎంఆర్ఎల్ను ఆదేశించింది. గతంలో వేసిన అడుగుల తాలూకు చిక్కుముళ్లను విప్పితే తప్ప హెచ్ఎంఆర్ఎల్ సాఫీగా ముందుకుపోలేని పరిస్థితి ఉన్నది. ఆ తర్వాతనే సీఎం రేవంత్రెడ్డి ఆదేశించినట్టుగా, జూబ్లీ బస్స్టేషన్ నుంచి ఫలక్నుమా మీదుగా చాంద్రాయణగుట్ట, నాగోల్ నుంచి ఎల్బీనగర్ మీదుగా చాంద్రాయణగుట్ట వరకు మెట్రో మార్గాల ఏర్పాటుకు సర్వే చేయాల్సి ఉన్నది. అనంతరం చాంద్రాయణగుట్ట నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేయడంలో రెండు మార్గాల్లో ప్రతిపాదన ఉన్నది.
చాంద్రాయణగుట్ట నుంచి మైలార్దేవ్పల్లి, జల్పల్లి, పీ7 రోడ్డు మీదుగా విమానాశ్రయం వరకు సుమారు 13 కిలోమీటర్లు.. బార్కాస్, పహాడీషరీఫ్, శ్రీశైలం రోడ్డు మీదుగా విమానాశ్రయం వరకు దాదాపు 17 కిలోమీటర్ల ప్రతిపాదన మార్గాలు.. ఇలా మొత్తం నాలుగు మార్గాలపై సర్వే చేయించి, డీపీఆర్ రూపొందించాల్సి ఉన్నది. ఇదంతా సుమారు 50 కిలోమీటర్ల వరకు వచ్చే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో గతంలో 278 కిలోమీటర్లకు ఎంపిక చేసిన కన్సల్టెన్సీలతో ఈ సర్వే చేయించాలా? అందుకు వాళ్లు అంగీకరిస్తారా? లేదా గతంలో వాటిని రద్దు చేసుకొని, వీటి కోసం ప్రత్యేకంగా కన్సల్టెన్సీల ఎంపిక చేపట్టాలా? ఇలా అనేక సందేహాల మధ్య హెచ్ఎంఆర్ఎల్ అధికారులు తేల్చుకోలేకపోతున్నట్టు తెలిసింది.