యాచారం, నవంబర్ 11: తెలంగాణలో పంటల సాగు విధానం ఎంతో బాగున్నదని విదేశీ ప్రతినిధుల బృందం సభ్యులు కితాబిచ్చారు. విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో 12 దేశాలకు చెందిన 21 మంది ప్రతినిధులు శుక్రవారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గడ్డమల్లయ్యగూడ గ్రామంలో పర్యటించారు. కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ, మేనేజ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో గ్రామంలో సాగు చేస్తున్న పంటలను వారు పరిశీలించారు. మెట్ట పంటల సాగు పద్ధ్దతులను రైతులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణలో ఆధునిక సాగు విధానం ఎంతో బాగున్నదని మెచ్చుకున్నారు. యాంత్రీకరణతో మెట్ట పంటలు, కూరగాయల సాగు చేస్తున్న విధానం తమను ఆకర్షించిందన్నారు. గున్గల్ కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థతో ఇక్కడి రైతులకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నారు. రైతుల అభ్యున్నతికి కృషి విజ్ఞాన కేంద్రం అందిస్తున్న సేవలను వారు కొనియాడారు.