రాయపోల్, నవంబర్ 7: సద్దిమూట కట్టుకుని, పొట్టకూటి కోసం కూలీ బాట పట్టిన ఆ మహిళలను లారీ రూ పంలో మృత్యువు కబళించింది. రోజు మాదిరిగానే ఇల్లు దాటి, ఊరి శివారు దాటక ముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. రాయపోల్ గ్రామానికి చెందిన చింతకింది కవిత (27), ఇప్ప శ్యామల (30), కొంగరి రాజమణి (45) సోమవారం ఉదయం వ్యవసాయ కూలీ పనుల కోసం రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళ్తున్నారు. దౌల్తాబాద్ నుంచి గజ్వేల్ వైపు వెళ్తున్న ఓ లారీ ముగ్గురు మహిళలపై నుంచి దూసుకెళ్లి, పక్కనే ఉన్న విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టింది.
లారీ టైర్ల కింద పడిన చింతకింది కవిత, ఇప్ప శ్యామల అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన కొంగరి రాజమణిని గాంధీ దవాఖానకు తరలించారు. శ్యామల భర్త దివ్యాంగుడు కావడంతో కుటుంబ భారాన్ని ఆమెనే చూసుకుంటున్నది. ఘటనా స్థలానికి చేరుకున్నబాధితుల బంధువులు, గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి, రాస్తారోకో చేశారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న తొగుట సీఐ కమాలాకర్, ఎస్సై షేక్ మహబూబ్ న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.