హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): విజయవాడ, హైదరాబాద్కు చెందిన కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులలో లేని వైకల్యాలు, దీర్ఘకాలిక అనారోగ్యాల పేరుతో తప్పుడు రీఫండ్లను క్లెయిమ్ చేసి సుమారు రూ.40 కోట్ల స్కాంకు పాల్పడినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఇందులో ఎనిమిది మంది ట్యాక్స్ కన్సల్టెంట్లు, పలువురు రైల్వే, పోలీసుశాఖల ఉద్యోగులు కీలకపాత్ర పోషించినట్టు గుర్తించారు.
దీంతో హైదరాబాద్, విజయవాడల్లోని పలు ఐటీ కంపెనీల్లో అధికారులు సోదాలు చేశారు. ఐటీ శాఖనే బురిడీకొట్టించిన కంపెనీలు, వ్యక్తులపై ఆయా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ స్కామ్లో ప్రస్తుతం గుర్తించింది రూ.40 కోట్లే అయినా.. అంతకంటే భారీగా రీఫండ్ స్కాం జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బోగస్ రిఫండ్ క్లెయిమ్స్లో వచ్చిన మొత్తంపై ట్యాక్స్ కన్సల్టెంట్లు, ఏజెంట్లు పదిశాతం కమీషన్ వసూలు చేసినట్లు గుర్తించారు.
మోసానికి తెరలేపిన కంపెనీలు, వ్యక్తులను గుర్తించి నోటీసులు ఇవ్వనున్నారు. అదనపు కన్సల్టెంట్లు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. 2017లోనూ ఇదే తరహా మోసాన్ని ఐటీశాఖ గుర్తించింది.