కల్వకుర్తి, ఏప్రిల్ 20: పారాబాయిల్డ్ రైస్మిల్లులో భారీగా ధాన్యం బస్తాలు మాయమైన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో చోటుచేసుకున్నది. కల్వకుర్తి పట్టణంలోని లక్ష్మీ వెంకటనర్సింహస్వామి పారాబాయిల్డ్ రైస్మిల్లులో శనివారం హైదరాబాద్ సివిల్సప్లయి, టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు జరిపారు. సీఎంఆర్ వడ్లకు సంబంధించిన లెక్కలు చూసి మిల్లులోని బస్తాల ను లెక్కించారు.
సీఎంఆర్కు సంబంధించిన 2,86,694 ధాన్యం బస్తాలు తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. వీటి విలువ రూ.23.3 కోట్లుగా అధికారులు తెలిపారు. చాలా మంది మిల్లర్లు ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని చీకటి మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో సివిల్సప్లయి, టాస్క్ఫోర్స్ అధికారుల బృందం రైస్మిల్లులో తనిఖీలు చేపట్టింది. ధాన్యం బస్తాలు మాయమవడంతో మిల్లు యజమానిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫారసు చేశారు. ఈ దాడుల్లో డీఎస్డీవో, డీఎం(క్యాలిటీ కంట్రోల్), డీటీలు పాల్గొన్నారు.