హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయ(కేజీబీవీ)ల్లో బోధనాభ్యసన తీరుతెన్నులను ఐఐటీ గాంధీనగర్ బృందం ఆదివారం పరిశీలించింది. ఐఐటీ గాంధీనగర్కు చెందిన రిసెర్చ్ ఫెలో బృందం రాష్ట్రంలో పర్యటించి, కేజీబీవీల్లో అమలవుతున్న ఆన్లైన్ శిక్షణను పర్యవేక్షించింది. గతంలో రాష్ట్ర విద్యాశాఖతో ఐఐటీ గాంధీనగర్ చేసుకొన్న ఒప్పందం ప్రకారం ‘క్యూరియాసిటీ’ అనే ప్రోగ్రాంను నిర్వహిస్తున్నారు. దీనిద్వారా పాఠ్యాంశాలను ప్రయోగాత్మకంగా ఆసక్తికరంగా ఎలా నేర్చుకోవచ్చో శిక్షణనిస్తున్నారు.
ఉపకరణాలు, బోధనాభ్యసన సామగ్రి తయారుచేయడంలో తర్ఫీదునిస్తున్నారు. ఈ విధానాన్ని పరిశీలించేందుకు ఐఐటీ గాంధీనగర్ బృందం రంగారెడ్డి జిల్లాలోని కిస్మత్పూర్ సహా పలు కేజీబీవీ స్కూళ్లను సందర్శించి, సంతృప్తి వ్యక్తంచేసింది.