హైదరాబాద్, జూన్22 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల స్థానికత నిర్ధారణ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) అమలు చేస్తున్న విధానాన్ని హైకోర్టు తప్పుపట్టింది. టీజీపీఎస్సీ ద్వంద్వ విధానాన్ని అమలు చేస్తున్నదని తేల్చింది. ఒక సందర్భంలో అర్హత పరీక్షకు ముందు వరుసగా నాలుగేండ్లు తెలంగాణలో చదువలేదన్న కారణంతో అభ్యర్థిని స్థానికుడిగా గుర్తించలేదని, మరో సందర్భంలో 1 నుంచి 7వ తరగతి వరకు తెలంగాణ వెలుపల చదివారనే కారణంతో స్థానికతను నిరాకరించిందని పేర్కొంటూ.. ఇది సరైన విధానం కాదని స్పష్టం చేసింది. స్థానికత నిర్ధారణకు చట్టబద్ధంగా నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించడంలో టీజీపీఎస్సీ విఫలమైందని ఆక్షేపించింది.
రాష్ట్రపతి ఉత్తర్వులు-2018లోని పేరా-7లో పేర్కొన్న నిబంధనలను విడివిడిగా కాకుండా సమగ్రంగా చదువాలని, వాటికి సంబంధించిన వ్యాఖ్యానాలను కూడా పరిగణనలోకి తీసుకుని సమిష్టిగా అమలు చేయాలని పేర్కొన్నది. స్థానికత విషయంలో రాజ్యాంగబద్ధ సంస్థగా టీజీపీఎస్సీ స్థిరమైన, ఒకే తరహా ప్రమాణాలను పాటించాలని ఆదేశించింది. 2022 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) నియామకాల వ్యవహారంలో పీ నిశాంత్ అనే అభ్యర్థిని స్థానికుడిగా పరిగణించాలన్న సింగిల్ జడ్జి తీర్పుపై టీజీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీల్ను కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ పీ శ్యాంకోశీ, జస్టిస్ నందికొండ నర్సింగరావు ధర్మాసనం తీర్పు వెలువరించింది.