వనపర్తి, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): ధాన్యం దొంగలు దొరికారు. వనపర్తి జిల్లా చిన్నంబాయి మండలం పెద్దదగడలోని ప్రభుత్వ గోడౌన్ నుంచి అర్ధరాత్రి ధాన్యం బస్తాలను దొంగిలించిన ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. ఈ విషయమై నమస్తే తెలంగాణ దినపత్రిక గత మూడు రోజులుగా కథనాలు ప్రచురించింది.
స్పందించిన పోలీసులు అత్యంత గోప్యంగా పోలీసులు విచారణ జరిపారు. వనపర్తి సీఐ నాగభూషణ్రావు కథనం మేరకు.. పెద్దదగడలో ధాన్యం బస్తాలను ఎత్తుకెళ్లిన సంఘటన తెల్సిందే. విచారణ అనంతరం మొత్తం 13 మందిని నిందితులుగా గుర్తించి 13 వేల ధాన్యం బస్తాలు చోరీకి గురైనట్టు తేల్చారు.
ఈ మేరకు చిన్నంబాయి ఎస్సై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఏడుగురిని పెద్దకొత్తపల్లి క్రాస్ రోడ్డు సమీపంలో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించారు. వీరిలో ఏ-1 బిలకంటి మౌనిష్ అలియాస్ మనీ (పెద్దకార్పాముల), ఏ-2 ఎండీ మహమూద్ (పెద్దకార్పాముల), ఏ-3 శ్రీనివాసులు (వనపట్ల), ఏ-4 బాలపీరు (పెద్దకొత్తపల్లి), ఏ-5 శివశంకర్ (సాతాపూర్), ఏ-6 సాయికుమార్ (పెద్దకార్పాముల), ఏ-7 బాలరాజు (పెద్దకొత్తపల్లి) ఉన్నారు.
మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్టు సీఐ తెలిపారు. ఇదిలావుంటే ధాన్యాన్ని ప్రభుత్వ గోడౌన్ నుంచి కొందరు వ్యక్తులు దర్జాగా తరలించుకుపోతే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం గమనార్హం. పొద్దుపోయిన తరువాత ఓ మెసేజ్ ద్వారా సమాచారం ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది.