గంగాధర : వానాకాలంలో పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని , రైతులు అధైర్యపడొద్దని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. మండలంలోని నారాయణపూర్, మధురానగర్, మంగపేట గ్రామాల్లో ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయబోమని చెబుతున్నా, రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చి కొనుగోలు చేయడం అభినందనీయమని అన్నారు.
రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ పుల్కం నర్సయ్య, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, సర్పంచులు యండీ నజీర్, వేముల లావణ్య, తోట వేదాంతి, మడ్లపెల్లి గంగాధర్, పొట్టల కనుకయ్య, ఆత్మ చైర్మన్ తూం మల్లారెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ఇస్మాయిల్, బీసీసెల్ అధ్యక్షుడు ఇప్పలపెల్లి మధుసూదన్, నాయకులు రామిడి సురేందర్, వేముల అంజి, తోట మహిపాల్, గర్వందుల పర్శరాములు, ముద్దం నగేశ్, ఎగుర్ల మల్లయ్య, పెంచాల చందు తదితరులు పాల్గొన్నారు.