న్యూఢిల్లీ, మార్చి 16: మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభ దశ మొదలయ్యిందని కేంద్ర బృందం హెచ్చరించింది. పటిష్ఠమైన కట్టడి వ్యూహాలపై దృష్టి పెట్టాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. మహారాష్ట్రలో అనుమానిత కరోనా కేసులను గుర్తించడం, పరీక్షలు నిర్వహించడం, కరోనా సోకిన వారిని గుర్తించి విడిగా ఉంచటం, వారికి దగ్గరగా మెలిగిన వారిని క్వారంటైన్లో ఉంచడంలో యంత్రాంగం చాలా పరిమితంగా పనిచేస్తున్నదని కేంద్ర బృందం తన నివేదికలో పేర్కొంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు కరోనా జాగ్రత్తలను పాటించడం లేదని గమనించినట్టు తెలిపింది. రాత్రి కర్ఫ్యూలు, వారాంతపు లాక్డౌన్ల ప్రభావం తక్కువగానే ఉంటుందని, కరోనా కట్టడికి కంటైన్మెంట్ వ్యూహాలు, నిఘాను కట్టుదిట్టం చేయడంపై దృష్టి సారించాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో కేంద్రం సూచించింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో మధ్యప్రదేశ్లోని భోపాల్, ఇండోర్లో బుధవారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమలులోకి రానున్నది. దేశంలో మంగళవారం కొత్తగా 24,492 కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసులు 20 వేలకు పైగా నమోదు కావడం ఇది వరుసగా ఆరో రోజు.