200 యూనిట్లు ఉచిత కరెంట్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను తొలుత రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వేదికగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమం రద్దవ్వడంతో అదే మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సభ జనజాతరను నిర్వహించింది.
హైదరాబాద్ సిటీబ్యూరో, రంగారెడ్డి, ఫిబ్రవరి 27(నమస్తే తెలంగాణ): ‘సొమ్మొకరిది.. సోకొకరిది’ అంటే ఇదేనేమో! ప్రభు త్వ సొమ్ముతో అట్టహాసంగా ఏర్పాట్లు చేసి న సభలో కాంగ్రెస్ సొంత డప్పు కొట్టుకున్నది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలను ప్రారంభించేందుకు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఫరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ ప్రాంగణాన్ని ప్రభుత్వం ఎంచుకొని సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీతో ఈ వేదిక మీద నుంచి ఈ రెండు పథకాలను ప్రారంభించాలని తొలుత భావించారు.
చివరి నిమిషంలో ఆమె పర్యటన రద్దు కావడంతో వర్చువల్ విధానంలో ప్రారంభించాలని భావించి అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. అంతవరకు బాగానే ఉన్నా సోమవారం రాత్రి ఉన్నట్టుండి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో అధికారిక కార్యక్రమాన్ని సచివాలయానికి మార్చి, ఆ వేదికను మాత్రం రాత్రికిరాత్రే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభ ‘జనజాతర’గా మార్చేశారు. ఇది చూసి ప్రజలు విస్మయం చెందారు. ప్రభుత్వ సొమ్ముతో కాంగ్రెస్ సభ నిర్వహించిందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.
ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా 200 యూనిట్లు ఉచిత కరెంట్, రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాలను చేవెళ్ల వేదికగా మంగళవారం ప్రారంభించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించనుండటంతో అధికారయంత్రాంగం కొన్ని రోజులుగా చెమటోడ్చింది. ఫరా కళాశాల ప్రాంగణంలో సభ నిర్వహణకు సంబంధించి కలెక్టర్తో సహా వివిధశాఖల అధికారులు వరుసగా ఐదు రోజుల పాటు పర్యవేక్షించారు. లక్షమంది మహిళలను సభకు తరలించేలా ఏర్పాట్లు జరిగాయి. డీఆర్డీవో, మెప్మా అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మూడు జిల్లాల నుంచి 15 వేల మందిని, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి మూడు వేలమంది చొప్పున మహిళలను సభకు రప్పించేలా మౌఖిక ఆదేశాలు వెళ్లడంతో అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేశారు. స్టేజీ ఏర్పాటుతోపాటు సభా ప్రాం గణానికి సమీపంలో హెలిప్యాడ్ నిర్మించారు.
మహిళల తరలింపు కోసం ఆర్టీసీ బస్సులను బుక్ చేశారు. సోమవారం రాత్రి వరకు కలెక్టర్తోపాటు అధికార యంత్రాం గం ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించింది. ఇందుకుకోసం లక్షలాదిరూపాయల ప్రజాధనాన్ని కుమ్మరించింది. అంతలోనే మహబూబ్నగర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో చేవెళ్ల సభ నిర్వహణపై సందిగ్ధత నెలకొన్నది. సోమవారం రాత్రి వరకు ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు వెనుదిరిగారు. కాంగ్రెస్ పెద్దలు మాత్రం సభ నిర్వహణకే మొగ్గు చూపారు. రెండు గ్యారెంటీల ప్రారంభోత్సవాన్ని సచివాలయంలోనే కానిచ్చేసి సభను ‘జనజాతర’గా మార్చేసి చేవెళ్లలో నిర్వహించారు.
మంగళవారం నాటి సభకు ప్రజలు బస్సులు, జీపులు, ఇతర వాహనాల్లో పెద్ద ఎత్తున తరలించారు. రాజకీయ సభగానే కాంగ్రెస్ నేతలు అభివర్ణించుకుంటున్నప్పటికీ అధికార సభనే తలపించింది. ప్రజాధనం రూ. కోట్లలో దుర్వినియోగం అయ్యిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల జాతర సందర్భంగా కోస్గిలో నిర్వహించిన ప్రభుత్వ అధికారిక సభలో సీఎం రేవంత్రెడ్డి అధికార యంత్రాంగం సమక్షంలోనే పార్టీ సభలా వంశీచంద్రెడ్డిని పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడంపైనా విమర్శలు వెల్లువెత్తాయి.