హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు ‘మన ఊరు- మనబడి’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్కారు.. విద్యా ప్రమాణాలు పెంచేందుకు కూడా పటిష్ఠ చర్యలు తీసుకొంటున్నది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల విద్యార్థులు రాణించేలా 4 నెలలుగా అమలు చేస్తున్న ‘తొలిమెట్టు’ కార్యక్రమం సత్ఫలితాలిస్తున్నది. ఉపాధ్యాయులు మూస పద్ధతిన కాకుండా పాఠ్య ప్రణాళికలు తయారు చేసి బోధన ఉపకరణాలతో బోధిస్తుండటంతో విద్యార్థులు సులువుగా పాఠ్యాంశాలను అర్థం చేసుకొంటున్నారు. నాలుగు మాసాల్లో ఒక్కో టీచర్ సొంతంగా 15-20 వరకు బోధన ఉపకరణాలను తయారు చేసి బోధిస్తుండటం వల్ల ఉపాధ్యాయుల్లో పోటీతత్వం కూడా పెరిగింది.
టీచర్లు స్తబ్దత వీడి నూతన చైతన్యంతో కొత్త పంథా అవలంభిస్తున్నారు. స్కూల్ క్లాంప్లెక్స్ సమావేశాలు ఫలవంతంగా జరుగుతున్నాయి. అన్ని స్థాయిల్లో విద్యానాయకత్వం అభివృద్ధి చెందింది. అన్ని స్కూళ్లల్లో పాఠ్యపుస్తకాల వినియోగం పెరిగింది. సోపానాల ప్రకారం, సామర్థ్యాన్ని బట్టి బోధన కొనసాగుతున్నది. ప్రతినెలా విద్యార్థుల ప్రగతిని నమోదు చేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ పెరిగింది. 600 మండలాల్లో 1,800 క్లస్టర్లు పర్యవేక్షణ అధికారులు నియమితులయ్యారు. ఎన్జీవోల భాగస్వామ్యం పెరిగి విద్యార్థులకు కావాల్సిన వసతులు సమకూరుస్తున్నారు. మొదటి విడతలో కథల పుస్తకాలను అందజేస్తున్నారు.