Telangana | హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): ఎక్కడో మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో కొయినా డ్యాం.. అక్కడి నుంచి అవసరం లేకున్నా తెలంగాణ 30 టీఎంసీల నీళ్లు అడుగుతున్నది. అందుకు బదులుగా ఆ 30 టీఎంసీల నీటితో కొయినాలో ఎంత కరెంటు ఉత్పత్తి చేస్తారో అంత కరెంటు ఇస్తామని ఆఫర్ ఇస్తున్నది. మనదగ్గర మిగులు కరెంటేమీ లేదు. మనమే రోజూ బహిరంగ మార్కెట్లో కరెంటు కొంటున్నాం. కొయినాలో 1 టీఎంసీతో 40 మిలియన్ యూనిట్ల కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు. ఆ లెక్కన 1200 మిలియన్ యూనిట్ల కరెంటును బహిరంగ మార్కెట్లో కొనాలంటే తెలంగాణ తక్కువలో తక్కువ రూ.700 కోట్లు ఖర్చు చేయాలి. ఇది పైన కనిపించే లెక్క.. అసలు లెక్క మరొకటి ఉన్నది. కొయినా నుంచి మనకు నీరు రావాలంటే కర్ణాటక మీదుగానే రావాలి.
ఆ రాష్ట్రంలోని నారాయణపూర్, ఆల్మట్టి వంటి డ్యాములను దాటుకొంటూ రావాలి. తెలంగాణ కొన్న నీరు కదా అని కర్ణాటక ఊరికే దిగువకు వదులుతుందా? ఆ నీటిని వదిలేటప్పుడు ఎంచక్కా టర్బైన్లను తిప్పి కరెంటు తయారు చేసుకొంటుంది. అంటే మనం రూ.700 కోట్లు పెట్టి కొనుక్కొనే నీటితో కర్ణాటక పైసా ఖర్చు లేకుండా కరెంటు తయారుచేసుకొంటు ందన్నమాట. ఇదీ రేవంత్రెడ్డి ప్రభుత్వం తెగ హడావిడి చేస్తున్న ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం. ప్రస్తుతం తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో నడుస్తున్న థర్మల్, జల విద్యుత్తు కేంద్రాలు, కేంద్రం నుంచి వస్తున్న విద్యుత్తు, ఇతర సంస్థలతో చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు, సౌర విద్యుత్తు ఇవన్నీ కలుపుకున్నా మన రాష్ట్ర విద్యుత్తు అవసరాలకు సరిపోవడం లేదు. గరిష్ఠంగా మన వినియోగం రోజూ 250 నుంచి 300 మిలియన్ యూనిట్ల మధ్యన ఉంటున్నది. మనకు వస్తున్న విద్యుత్తు 200 మిలియన్ యూనిట్లు దాటడం లేదు. దీంతో సగటున 50 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్తు కొరత ఏర్పడుతున్నది. అందుకే రోజూ బహిరంగ మార్కెట్లో సగటున 50 మిలియన్ యూనిట్ల వరకు కొనుగోలు చేయాల్సి వస్తున్నది. ఆయా సమయాల్లో లభించే విద్యుత్తు, డిమాండ్ను బట్టి గరిష్ఠంగా యూనిట్కు రూ.12 వరకు ఖర్చుపెట్టి కొనుగోలు చేస్తున్నారు. సగటున చూస్తే యూనిట్కు రూ.6 వరకు చెల్లించాల్సి వస్తున్నది.
ఎక్కడో 11 వందల కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న కొయినా డ్యాం నుంచి 30 టీఎంసీల నీటిని తెలంగాణకు విడుదల చేస్తే.. అందుకు ప్రత్యామ్నాయంగా విద్యుత్తును ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రకు ప్రతిపాదించింది. మన దగ్గర మిగులు విద్యుత్తు లేదు. కనుక ఆ నీరు ప్రవహించే కృష్ణా నది వెంట జల విద్యుత్తును ఉత్పత్తి చేసి మహారాష్ట్రకు ఇవ్వడం మరో మార్గం. మన రాష్ట్రం పరిధిలో అప్పర్ జూరాల, లోయర్ జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్, పులిచింతలలో మాత్రమే జల విద్యుత్తు ఉత్పత్తికి అవకాశం ఉన్నది. ఇప్పుడు తాగునీటి కోసం మాత్రమే నీటిని అడుగుతున్నాం కనుక.. జూరాల (234 మెగావాట్లు), లోయర్ జూరాల (240 మెగావాట్లు), శ్రీశైలం (900 మెగావాట్లు)లో మాత్రమే జల విద్యుత్తుకు అవకాశం ఉన్నది.
30 టీఎంసీల నీటితో మహారాష్ట్ర 1200 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. ఒకవేళ ఒప్పందమే కుదిరితే 1200 మిలియన్ యూనిట్ల విద్యుత్తును మనం అందించాల్సి ఉంటుంది. రెండు మార్గాల్లో అవకాశాలు లేకపోవడంతో, మిగిలింది ఆ విద్యుత్తుకు అయ్యే ఖర్చును మనం భరించడమే. బహిరంగ మార్కెట్లో సగటున యూనిట్ను రూ. 6కు కొనుగోలు చేసినా రూ.700 కోట్లకుపైగా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు మొత్తం మనమే భరించాల్సి ఉంటుంది. ఇది తెలంగాణ రాష్ర్టానికి అదనపు భారమే. ప్రస్తుత పరిస్థితుల్లో మంచినీటికి తెలంగాణలో కటకట లేదు. రిజర్వాయర్లలో తాగునీటి కోసం జల వనరులున్నాయి. భూగర్భ జలాలుకూడా పుష్కలంగా ఉన్నాయి. మరి ఇప్పుడు మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చే నీటితో మనకు ప్రయోజనం ఏంటనే అనుమానాలను నిపుణులు వ్యక్తంచేస్తున్నారు. మనకు ఆర్థికంగా భారం కలిగించే ప్రతిపాదనను సిద్ధం చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా? లేదా కర్ణాటకకు లోపాయికారిగా ప్రయోజనం చేకూర్చడమే దీని వెనుక ఉన్న మతలబా? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మనకు ఉపయోపడని కరెంటును కొనుగోలు చేసి.. మహారాష్ట్రకు ఇవ్వడానికి రూ.700 కోట్ల వరకు ఖర్చు భారాన్ని మోయాల్సిన పరిస్థితే వస్తే మన కరెంటు మహారాష్ట్రకు వెళ్లినట్టే.
ప్రస్తుతం కర్ణాటకలో విద్యుత్తు సంక్షోభం నెలకొన్నది. ఒకవేళ మన ప్రతిపాదనకు స్పందించి మహారాష్ట్ర 30 టీఎంసీల నీటిని విడుదల చేస్తే.. ఆ నీరు కర్ణాటక గుండా కృష్ణానదిలో తెలంగాణ సరిహద్దు ప్రాజెక్టు అయిన జూరాల వరకు రావాలి. అంటే మహారాష్ట్ర విడుదల చేసిన నీరు నారాయణ్పూర్, ఆల్మట్టి డ్యాముల నుంచి రావాల్సిందే. ఇక్కడ కర్ణాటకకు జల విద్యుత్తు కేంద్రాలున్నాయి. ప్రత్యామ్నాయంగా విద్యుత్తును ఇస్తామని చెప్పింది తెలంగాణే కావచ్చు. కానీ అప్పనంగా కర్ణాటకకు జల విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే అవకాశం చిక్కుతుంది. తప్పకుండా జల విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటుంది. అలా చేస్తేనే నీళ్లు దిగువన ఉన్న మనకు చేరుతాయి. ఇలా చూసుకుంటే కర్ణాటకు లాభం కలిగించేందుకే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వినూత్నంగా ఈ తరహా ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చిందా? అనే అనుమానాలు బలపడక తప్పదు.
మహారాష్ట్రలోని కోయినా డ్యాం పశ్చిమ కనుమల్లో ఉన్నది. ఇది సుమారు 2000 అడుగుల ఎత్తైన పర్వతాల మధ్యలో ఉండటం వల్ల దీనిపై నిర్మించిన జల విద్యుత్తు కేంద్రాల సామర్థ్యం 1960 మెగావాట్లు. పైగా ఒక్కో జల విద్యుత్తు కేంద్రం ద్వారా విడతలవారీగా విద్యుత్తును ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఒక టీఎంసీ నీటితో ఇక్కడ (పశ్చిమం వైపు) 40 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. కృష్ణా నదిలోకి కోయినా నీటిని వదిలితే శ్రీశైలం డ్యాం వద్ద 4 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. కానీ జూరాలలో ఒక టీఎంసీతో 1.5 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేయగలం. పైగా జూరాలలో ఉత్పత్తి అయ్యే కరెంటులో 50 శాతం కర్ణాటకకు ఇవ్వాలనే ఒప్పందం ఉన్నది. ఇప్పటివరకూ అలాగే ఇస్తూ వస్తున్నాం. అంటే ఇక్కడ కూడా ప్రత్యామ్నాయంగా విద్యుత్తును ఉత్పత్తి చేసి సరఫరా చేయడం సాధ్యం కాదు. అది చాలా స్వల్పం అవుతుంది.