హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): కొత్తరకం వైకల్యాలతో బాధపడుతున్న విద్యార్థులకు ప్రభుత్వం వార్షిక పరీక్షల్లో పలురకాల మినహాయింపులను ఇచ్చింది. ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న 8 క్యాటగిరీల్లోని విద్యార్థులకు పలు మినహాయింపులిస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. వీరిలో కొందరికి పాస్ మార్కులు 35 నుంచి 10కి, మరికొందరికి 20కి కుదించారు. స్ర్కైబ్ (సహాయకులను)ను వినియోగించుకొనే అవకాశం ఇవ్వడంతోపాటు క్యాటగిరీని బట్టి సబ్జెక్టు మినహాయింపు (భాషలు)ను సైతం వర్తింపజేశారు. 2022 -23 విద్యాసంవత్సరం నుంచి ఇవి వర్తిస్తాయని, రాబోయే పదో తరగతి పరీక్షల్లోనూ వీటిని వర్తింపజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.